వినాయకచవితినాడు విడుదల అయిన రజనీకాంత్ శంకర్ల '2.0' టీజర్కు కేవలం ఒకే రోజులో వచ్చిన 3 కోట్ల హిట్స్ ఇప్పడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. గత మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రానికి 550 కోట్ల బడ్జెట్ ఖర్చు ఇప్పటికే అయింది అన్న వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో గ్రాఫిక్స్ భారీ స్థాయిలోఉన్న నేపధ్యంలో ఈమూవీ బడ్జెట్ మరో 200 కోట్ల దాటినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.
ఇది ఇలా ఉండగా ఈమూవీ టీజర్ సంచలనాలు సృష్టిస్తున్న నేపధ్యంలో ఈటీజర్ ను కంప్యూటర్లలో మొబైల్స్లో చూసిన వారు మాత్రం గ్రాఫిక్స్ అంత గొప్పగా లేవని పెదవి విరుస్తున్నారు. అయితే ఈటీజర్ ను 3డి ఫార్మేట్ లో థియేటర్లలో చూసిన వారు మాత్రం విపరీతంగా మెచ్చుకుంటున్నారు. దీనితో '2.0' మూవీని త్రీడీలో చూడాల్సి వస్తే ఇండియాలో ఎన్ని బెస్ట్ స్క్రీన్లు ఉన్నాయి ? అన్న చర్చలు ఊపందుకున్నాయి.
వాస్తవానికి ‘బాహుబలి’ చిత్రానికి 3డి హంగులు లేకుండానే విడుదల చేసినా ఒక అద్భుతాన్ని చూసిన అనుభూతితో ఆమూవీకి రికార్డుల కలక్షన్స్ కురిపించారు. ‘బాహుబలి’ ట్రైయిలర్ రిలీజ్ అయినపుడు 2.0 కి వచ్చినట్లుగా ఇలాంటి మిక్స్డ్ టాక్ రాలేదు. ఫలానా టెక్నాలజీలోనే చూడాలనే ఫీలింగ్ ప్రేక్షకులలో కలుగలేదు.
ఇప్పుడు ప్రేక్షకులకు ఏర్పడిన ఈ త్రీడీ ఫీలింగ్ 2.0 కి శాపంగా మారినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. సెల్ టవర్స్ రేడియేషన్ తో వేల సంఖ్యలో పక్షులు చనిపోతున్న నేపధ్యంలో పక్షులు మానవ జాతి పై పగబట్టి చేసే వినాశనం ఊహించి శంకర్ వ్రాసుకున్న కథ ఎంతవరకు మాస్ ప్రేక్షకులకు అర్ధం అవుతుంది అన్న సందేహాలు కూడ ఉన్నాయి. ఈ సందేహాలు ఈమూవీ మార్కెట్ ను ప్రభావితం చేసే అంశంగా మారినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..