స్టార్ హీరోల సినిమాలకు సాధారణ హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ చాలా తేడా ఉంటుంది. స్టార్ హీరో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ హంగామా వారం, పది రోజుల ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. బెనిఫిట్ షోలు, తొలి రోజు హంగామాలు మామూలు, అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద పడిగాపులు రచ్చ మామూలుగా ఉండదు. ఇక సినిమా ఆడియో హిట్ అయితే హైప్ మామూలుగా ఉండదు. ఇక సూపర్స్టార్ మహేష్బాబు సినిమా వస్తుందంటే మహేష్ మానియాతో టాలీవుడ్ ఊగిపోతుంటుంది.
బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి డిజాస్టర్ల తర్వాత కూడా భరత్ అనే నేను సినిమాకు మామూలు క్రేజ్ రాలేదు. ఇప్పుడు మహర్షి సినిమాకు మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు పది రోజులు మాత్రమే ఉంది. భారీ ఎత్తున ప్రి రిలీజ్ ఫంక్షన్ ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాపై బజ్ చాలా తక్కువుగా ఉంది. ఎవరు ఒప్పుకున్నా... ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నిజం.
సినిమా డేట్ దగ్గర పడుతున్న కొద్ది క్రేజ్ బాగా పెరగాలి... కానీ అలా జరగడం లేదు. సినిమాలో కావాల్సినన్ని ఆకర్షణలు ఉన్నాయి. మహేష్, పూజా హెగ్డే, అల్లరి నరేష్, రావూ రమేష్, రాజేంద్రప్రసాద్ ఇలా చెప్పుకోవడానికి చాలా మందే ఉన్నారు. భారీ బడ్జెట్. సినిమా బజ్ తగ్గడానికి గత కారణాల్లో తొలి దెబ్బ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్. గతంలో మహేష్ - దేవిశ్రీ కాంబోలో ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్లు వచ్చాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఐదు సాంగ్స్ రిలీజ్ అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా టాప్ క్లాస్ సాంగ్ లేదు. పాటలన్నీ పరమ రొడ్డ కొట్టుడు బాణీలనే తలపిస్తున్నాయ్.
కనీసం మహేష్ వీరాభిమానులకే నచ్చలేదు. ఇక టీజర్ కూడా ఏ మాత్రం ఆసక్తిగా లేదు. టీజర్ చూసిన వాళ్లలో చాలా మంది మరో శ్రీమంతుడు అని సెటైర్లు వేస్తున్నారు. ఇక వంశీ పైడిపల్లి కథలు కొత్తగా ఉండవన్న కంప్లెంట్ కూడా ఉంది. పాత కథలకే కొత్త కోటింగ్తో రొటీన్ సినిమాలే తీస్తాడన్న టాక్ ఆయనపై ఉంది. ఇండస్ట్రీ ఇన్నర్ టాక్ ప్రకారం అవుట్ ఫుట్ కూడా గొప్పగా లేదట. సినిమా ఆడితే క్రేజ్ మీదే ఆడాలంటున్నారు. ఏదేమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్పై ఇప్పుడు మహర్షి ఆశలు మిగిలి ఉన్నాయ్.