భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న మహేశ్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు. 2020 సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల కాబోతుంది. బాలనటుడిగా 8 సినిమాల్లో నటించిన మహేశ్ బాబు రాజకుమారుడు సినిమాతో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ మొదలుపెట్టి హిట్ అందుకున్నాడు. 
 
రాజకుమారుడు సినిమా తరువాత మహేశ్ నటించిన యువరాజు యావరేజ్ అనిపించుకోగా వంశీ డిజాస్టర్ అయింది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మురారితో మహేశ్ తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కానీ మురారి తరువాత మహేశ్ నటించిన బాబీ, టక్కరిదొంగ సినిమాలు డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్నాయి. ఒక్కడు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న మహేశ్ బాబుకు నాని రూపంలో షాక్ తగిలింది. 
 
ఆ తరువాత మహేశ్ నటించిన అర్జున్ యావరేజ్ అనిపించుకోగా అతడు హిట్ అయింది. పూరీ మహేశ్ కాంబోలో తెరకెక్కిన పోకిరి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పోకిరి తరువాత మహేశ్ నటించిన సైనికుడు, అతిథి సినిమాలు డిజాస్టర్ అయ్యయి. ఖలేజా యావరేజ్ అనిపించుకోగా దూకుడు సినిమాతో మహేశ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దూకుడు తరువాత మహేశ్ నటించిన బిజినెస్ మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్ అయ్యాయి. 
 
సుకుమార్ మహేశ్ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే కమర్షియల్ గా ఫ్లాప్ అయినా ఒక వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మహేశ్ కు దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీను వైట్ల ఆగడు సినిమాతో భారీ డిజాస్టర్ ఇచ్చాడు. ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ కాగా బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు మాత్రం డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్నాయి. మహేశ్ కెరీర్లో వంశీ, బాబీ, టక్కరిదొంగ, నాని, సైనికుడు, అతిథి, ఆగడు, స్పైడర్, బ్రహ్మోత్సవం సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: