పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా కోసం పక్కా మాస్ మసాలా కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత ఇక పై మాస్ సినిమాలే చేస్తానని ఆయన ప్రకటించాడు . అందుకు అనుగుణంగానే మరో మాస్ స్టోరీని సిద్ధం చేసేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో విజయ్ తన బాడీ లాగ్వేజ్ మార్పులు చేర్పులు చేస్తున్నట్లు గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి.
త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ సినిమాను పూరీ తన సొంత బ్యానర్లో చేయనున్నాడు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. పూరి, ఛార్మి నిర్మాతలు,ప్రొడక్షన్ బాధ్యతలు ఛార్మీ దగ్గరుండి మరి చూసుకోనుంది.క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు ‘ఫైటర్' అనే టైటిల్ పెట్టబోతున్నారని కొద్ది రోజుల క్రితమే ఓ వార్త బయటకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ టైటిల్ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ కూడా చేశారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు డిసెంబర్లో జరగనున్నాయని, వెంటనే జనవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరగనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్గా కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం క్రాంతి మాధవ్ సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ.. అది పూర్తయిన వెంటనే మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకోడానికి ‘థాయ్లాండ్' వెళ్తాడని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మార్షల్ ఆర్ట్స్ బ్యాగ్ డ్రాప్లోనే నడుస్తుందట. అందుకే దీనికి ‘ఫైటర్' అనే పేరు పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రను చేయబోతున్నారట. ఆమె పాత్ర విజయ్ దేవరకొండకు దిశా నిర్ధేశం చేసే విధంగా ఉంటుందట. అంతేకాదు, ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే విజయ్, తన భవిష్యత్పై దృష్టి సారిస్తాడని ప్రచారం జరుగుతోంది.