ప్రముఖ వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల తెరకెక్కించిన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు… ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, టీజర్లు అక్కడి రాజకీయ నాయకులను వివాదాస్పదంగా చూపిస్తూ ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయిందని చెప్పాలి. ఇకపోతే ఏపీలోని రాజకీయ నాయకులందరినీ కూడా తన చిత్రంలో వాడేసుకున్నాడని, అందరు కూడా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మరికొద్ది రోజుల్లో విడుదలవనున్న ఈ చిత్రం మరిన్ని వివాదాలకు తెరతీస్తుందో అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా నవంబర్ 29 న విడుదలవనున్న ఈ చిత్రం టీడీపీ అధినేత చంద్రబాబు, నారాలోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకొని తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే పక్కాగా అర్థమవుతుంది. అయితే ఈ చిత్ర రెండవ ట్రైలర్ చూసాక తెలుగు తమ్ముళ్లు అందరు కూడా ఈ చిత్ర విడుదలని అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో ఆర్జీవీ తెరకెక్కించిన ఈ చిత్రం విడులవుతుందా అనేది ఆసక్తిగా మారిపోయిందని చెప్పాలి. మరి ఒకరకంగా చెప్పాలంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలానే దీన్ని కూడా ఆంధ్రాలో విడుదల చెయ్యడానికి కొన్ని ఇబ్బందులు తప్పవని అర్ధమవుతుంది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు.. ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడని కేఏ పాల్ ఆరోపించారు. అంతేకాదు ఈ నెల 29న విడుదల కానున్న ఈ సినిమాను నిలుపుదల చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో కేంద్ర సమాచార శాఖ, సెన్సార్ బోర్డ్ను ప్రతివాదులుగా చేర్చారు.