‘గద్దలకొండ గణేష్’ మూవీ తరువాత వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపధ్యంలో కొనసాగే ఒక మూవీ చేయాలని నిర్ణయించుకుని బాక్సింగ్ టెక్నిక్స్ నేర్చుకోవడానికి అమెరికా వెళ్ళి అక్కడ ప్రత్యేకమైన శిక్షణ కూడ తీసుకున్నాడు. కిరణ్ కొర్రపాటి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించే ఈ మూవీ స్క్రిప్ట్ కూడ పూర్తి అయింది.

అయితే ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండల మూవీ అడ్డుతగులుతోంది అన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పూరీ ఈ సినిమాకు సంబంధించిన కథ కూడ బాక్సింగ్ నేపధ్యంలోనే ఉంటుంది. అయితే వెరైటీ కోసం పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు నత్తి మ్యానరిజమ్ క్రియేట్ చేస్తున్నాడు. 

ఈ ఒక్క తేడా తప్ప ఇంచుమించు కథ అంతా వరుణ్ తేజ్ విజయ్ దేవరకొండల మూవీలకు సంబంధించి అంతా ఒకేలా ఉంటుంది అని అంటున్నారు. అంతేకాదు ఈ మూవీలోని ట్విస్ట్ లు కూడ ఒకేలా ఉంటాయని టాక్.దీనితో వరుణ్ తేజ్ ఎలర్ట్ అయి ఈ మూవీ ప్రారంభాన్ని ఆపు చేసి ఈ మూవీ కథలో పూర్తిగా మార్పులు చేసాక మాత్రమే నటిస్తాను అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నిధి అగ్రవాల్ నభా నటేష్ లు హీరోయిన్స్ గా ఎంపిక కావడంతో పాటు ఈ మూవీ ప్రారంభానికి అంతా సిద్ధమైన పరిస్థితులలో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు అనుకోకుండా విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ లు విలన్స్ గా మారడం షాకింగ్ గా మారింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి పరిస్థితులు చాల సినిమాలకు ఎదురౌతున్నాయి. చాలామంది డైరెక్టర్స్ కథలో వెరైటీ కోసం విదేశీ సినిమాల కథలను తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితులలో ఇలా ఒకే కథ ఇద్దరి హీరోలకు వేరువేరు సినిమాలుగా మారుతున్నాయి. దీనితో వరుణ్ తేజ్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: