బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అన్నీ కుదిరితే కృష్ణావతారం ఎత్తనున్నారు. ఇప్పటివరకు క్రిష్గా అభిమానులను అలరించిన హృతిక్ ఈసారి కృష్ణుడిగా అందరి మనసులను దొంగలించే అవకాశం ఉంది. మధు మంతెన నిర్మాణ భాగస్వామ్యంలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తెరకెక్కనున్న చిత్రం ‘మహాభారతం’.. అయితే భారీ కాస్టింగ్తో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు మధు మంతెన. దీపికా పడుకోన్ దీనిలో భాగంగా ద్రౌపది పాత్రను పోషించనున్నారు. అయితే అతిముఖ్యమైన కృష్ణుడి పాత్ర కోసం మహాభారతంలో పలువురు బాలీవుడ్ ఆగ్రహీరోలతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు.
దీనిలో భాగంగా హృతిక్ రోషన్తో ఫిల్మ్ మేకర్ మధు మంతెన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హృతిక్ కృష్ణుడి లాంటి చాలెంజింగ్ పాత్రలో నటించేందకు అంగీకరించినట్లు బాలీవుడ్ టౌన్లో పలు రకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు. అయితే గతంలో కృష్ణుడి పాత్రను అక్షయ్ కుమార్ లేక అమీర్ ఖాన్లు పోషించే అవకాశం ఉందని పలు రకాలుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా హృతిక్ పేరు తెరపైకి రావడంతో కృష్ణుడు ఎవరనే దానిపై సస్పెన్స్ ఇంకా వీడలేదు.
ఇక ద్రౌపది పాత్ర దీపిక పోషించనుండటంపై ఫిల్మ్మేకర్ మధు ఆనందం వ్యక్తం చేశారు. ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలు చూశాక రాణి పాత్ర అంటే దీపికనే చేయాలనే భావన కలిగిందన్నారు. అంతేకాకుండా ఈ రెండు సినిమాల్లో దీపిక రాణి పాత్రలో జీవించేశారని, అప్పటికాలంలో రాణులంటే ఇలాగే ఉండేవారేమో అనిపించేంతగా ఆ పాత్రలను పోషించారని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ద్రౌపది పాయింట్ ఆఫ్ వ్యూలో రూపొందడం విలక్షణమని చెప్పారు.
ఈ మూవీని దీపికా చిత్ర బృందంలో చేరడంతోనే భారీస్ధాయిలో రూపొందుతోందని.. ఆమె భారత్లో అతిపెద్ద నటి మాత్రమే కాకుండా సినిమాకు హద్దులు చెరిపివేసే సామర్థ్యం దీపికాకు ఉందని అన్నారు. తెలుగు, హిందీ సహా భిన్న భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీ పలు భాగాలుగా రూపొందనుంది. తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రానికి దీపిక సహ నిర్మాత వ్యవహరించనున్న విషయం తెలిసిందే.