ఎన్టీఆర్ అంటే అందరికి అభిమానం ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ధ్రువతారగా ఎదిగిన వ్యక్తి ఆయన. సినిమా రంగంలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. మెప్పించారు. నిర్మాతగా, దర్శకుడిగా కూడా వ్యవహరించారు. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి అక్కడ కూడా రాణించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. అందుకే ఇప్పటికి ఎన్టీఆర్ కు అభిమానులు కోకొల్లలు. వయసుతో సంబంధం లేకుండా అయన చేసిన సినిమా ప్రేక్షకులను రంజింపజేశాయి.
1948 వ సంవత్సరంలో వచ్చిన మనదేశం సినిమా ద్వారా ఎన్టీఆర్ వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ విషయం అందరికి తెలుసు. అందులో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశారు. ఆ పాత్రకు అయన ప్రాణం పోశారు. ఆ తరువాత నుంచి ఒక్కో సినిమా చేసుకుంటూ హీరోగా స్థిరపడిపోయారు. ఇంతవరకు బాగానే ఉన్నది. అయితే, చాలామందికి తెలియని విషయం ఒకటి ఉన్నది. అదేమంటే ఎన్టీఆర్ కు మనదేశం సినిమా కంటే ముందే ఓ సినిమాలో అవకాశం వచ్చింది.
కానీ, ఆ అవకాశాన్ని కావాలని కాదని పక్కన పెట్టారు. దానికి అయన చెప్పిన రీజర్ సూపర్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచింది. ఆ సినిమా ఏంటంటే... వింధ్యరాణి. ఈ సినిమాకు సి పుల్లయ్య దర్శకత్వం వహించారు. మంచి విజయం సాధించింది. అయితే, ఈ సినిమాలో నటించేందుకు ఎన్టీఆర్ ససేమిరా అన్నారట. దీనికి కారణం లేకపోలేదు. ఆ సమయంలో ఎన్టీఆర్ డిగ్రీ చదువుతున్నారు. డిగ్రీ పూర్తికాకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి అయన సుతానా ఇష్టం లేదు.
అందుకే సినిమాలో నటించని చెప్పేశాడు. స్వయంగా సి పుల్లయ్య ఎన్టీఆర్ కు ఉత్తరం రాస్తే కనీసం దానికి జవాబు కూడా ఇవ్వలేదట. దీంతో ఆ దర్శకుడు డైరెక్ట్ గా ఎన్టీఆర్ దగ్గరకి వచ్చి సినిమాలో నటించాలని కోరాడు. కానీ, డిగ్రీ పూర్తి కాకుండా సినిమాల్లోకి రాలేనని చెప్పేశారు. సినిమా రంగం అస్థిరమైనదని, ఒకవేళ అక్కడ రాణించలేకుంటే డిగ్రీ ఉంటె ఉద్యోగం అయినా సంపాదించుకోవచ్చని అన్నారు. అందుకే డిగ్రీ పూర్తికాకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమస్య లేదని చెప్పాడు ఎన్టీఆర్.