టాలీవుడ్ లో అందాల భామ కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం సినిమాతో జబర్దస్త్ గా ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయంతో ఆకట్టుకున్న కాజల్ ఆ తరువాత మగధీర, చందమామ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటె, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికే 12 సంవత్సరాలు దాటింది. సినిమాలు చేస్తూనే బిసినెస్ చేస్తున్నది. కానీ ఇప్పటికీ తన గ్లామర్ తో కుర్రాళ్ల మనసు దోచేస్తుంది. ఈ మద్య కవచం, సీత లాంటి సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి కుర్ర హీరోల తో సైతం నటించింది. ఎంతో కాలంగా కాజల్ అగర్వాల్ అభిమానులు ఎదురు చూసే రోజు రానే వచ్చింది. తెలుగు తెర అందాల చందమామ సింగపూర్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మగా కొలువు తీరింది.
ఇప్పటికే బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ విగ్రహాలు అక్కడ ఉన్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విగ్రహాలూ ఉన్నాయి. ఈ లిస్ట్లో కలువ కళ్ల కాజల్ అగర్వాల్ పేరు కూడా చేరింది. మేడమ్ టుస్సాడ్స్లో కొలువు తీరనున్న ఫస్ట్ సౌతిండియా హీరోయిన్గా కాజల్ అగర్వాల్ రికార్డులకు ఎక్కింది. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్లో ఈ రోజు కాజల్ మైనపు విగ్రహాన్నిఆవిష్కరించారు.
కాజల్ తన మైనపు బొమ్మతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, తన విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్లో పెడుతున్నందుకు సంతోషంగా ఉందని, దీనికోసం ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను అంటుంది ఈ కలువ కళ్ల సుందరి. ఇక సినిమాల విషయానికొస్తే.. విశ్వనటుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘భారతీయుడు 2’ తో పాటు తెలుగులో మంచు విష్ణు పక్కన ‘మోసగాళ్లు’ సినిమాలోనూ నటిస్తోంది కాజల్ అగర్వాల్. కొత్తగా కొలువుతీరిన చందమామ కాజల్ అగర్వాల్ విగ్రహం చూస్తుంటే.. అచ్చం నిజమైన కాజల్ అగర్వాల్ ని చూస్తున్నట్లే ఉంది.