కమెడియన్గా కెరీర్ మొదలుపెట్టి తరువాత నిర్మాతగా మారి, ఒక దశలో స్టార్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న టాలీవుడ్ నటుడు బండ్ల గణేష్. నిర్మాతగా కన్నా వేదికల మీద తన స్పీచులతో ఎక్కువ పాపులర్ అయిన బండ్ల గణేష్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. నిర్మాతగా ఫెయిల్యూర్స్ రావటంతో పాటు రాజకీయాల్లోను ఫెయిల్ అవ్వటంతో గణేష్, ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా పడిపోయాడు. దీంతో తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో కమెడియన్గా రీ ఎంట్రీ ఇచ్చాడు.
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేసిన గణేష్, ఆ పార్టీ విజయం సాధించకపోతే 7 ఓ క్లాక్ బ్లేడ్తో గొంతు కోసుకుంటానంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవటంతో బండ్ల గణేష్ కాస్త బ్లేడ్ గణేష్ అయిపోయాడు. ఆయన మాటలు ఆయన చేష్టలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయి. దీనికి తోడు సినిమా వేడుల్లో గణేష్ స్పీచులు కూడా నవ్వులు పంచటంతో గణేష్ను సీరియస్గా తీసుకోవటం మానేశారు జనాలు.
తాజాగా ఈ కమెడియన్ కం ప్రొడ్యూసర్ ఓ చిల్లర గొడవలో వేలు పెట్టాడు. రామ్ చరణ్. ఎన్టీఆర్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తుంటే ఆ రచ్చలోకి ఎంటరయ్యాడు గణేష్. సినిమా బ్రేక్ ఈవెన్ల విషయంలో ఇద్దరు హీరోల అభిమానులు ట్విటర్ లో మాటల తూటాలు పేలుస్తున్నారు. అంతేకాదు కాస్త శృతిమించి విమర్శలు చేసుకున్నారు కూడా. రామ్ చరణ్ ప్యాన్స్ తమ హీరో చేసిన 12 సినిమాల్లో 10 సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి అని ట్వీట్ చేయగా, దానికి కౌంటర్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్..ఆరెంజ్, జంజీర్, బ్రూస్లీ సినిమాలు ఫ్లాప్, గోవిందుడు అందరివాడేలే ఏవరేజ్ మరి 10 సినిమాలు బ్రేక్ ఈవెన్ ఎప్పుడయ్యాయి అంటూ రిప్లై ఇచ్చారు.
అయితే ఈ పంచాయితీలోకి ఎంటర్ అయిన బండ్లగణేష్ వాళ్ల మిగత గొడవంతా పక్కనపెట్టి గోవిందుడు అందరివాడేలే సినిమా హిట్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ సినిమాకు గణేషే నిర్మాత అన్న సంగతి తెలిసిందే. కృష్షవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించకపోయినా మంచి వసూళ్లనే సాధించింది.