యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్తో దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా 2021 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాకు సంబంధించి కూడా ఇప్పటి నుంచే చర్చ మొదలైంది.
ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇటీవల అల వైకుంఠపుములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు త్రివిక్రమ్. అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులు అన్నింటినీ బ్రేక్ చేసింది. ఈ భారీ హిట్ తరువాత ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది.
గతంలో ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత వీర రాఘవ సినిమాను తెరకెక్కించాడు త్రివిక్రమ్. ఆ సినిమాలో ఎన్టీఆర్ను సీరియస్ లుక్ లో చూపించిన దర్శకుడు, ఈ సారి పక్కింటబ్బాయిల చూపించే ఆలోచనలో ఉన్నాడట. అందుకు తగ్గట్టుగా తన స్టైల్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ లాంటి సీరియస్ సినిమా తరువాత ఓ ఫ్యామిలీ డ్రామా అయితేనే బెటర్ అని భావిస్తున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయమే పట్టే అవకాశం ఉంది.