సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
ఈ సినిమాకు తమన్ అందించిన పాటలకు ఈ దశాబ్దపు బెస్ట్ ఆల్బమ్ అనే స్థాయిలో పేరు రావటం విశేషం. ప్రస్తుతం బ్రేక్ తీసుకున్న బన్నీ త్వరలో సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.
తెలుగులో టాప్ స్టార్గా వెలుగొందుతున్న బన్నీ, మాలీవుడ్లోనూ టాప్ స్టార్గా ఎదిగాడు. తాజాగా ఈ స్టార్ హీరో బాలీవుడ్ మార్కెట్ మీద దృష్టి పెట్టాడు. ఇటీవల అల వైకుంఠపురములో ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే బాలీవుడ్ లో స్ట్రయిట్ సినిమా చేస్తానంటూ హింట్ ఇచ్చాడు బన్నీ. అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. ఇటీవల ప్రత్యేకంగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు అల్లు అర్జున్.
ఈ ఇంటర్వ్యూలలో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. `ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అన్న పేరుంది. అందుకే ఆ ఇండస్ట్రీ అంటే మాకు చాలా గౌరవం. నేను కూడా చాలా కాలంగా బాలీవుడ్లో సినిమాలు చేయాలనుకుంటున్నా. కానీ ఇంత వరకు ఏ స్క్రిప్ట్ కూడా బాలీవుడ్లో సినిమా చేసే స్థాయిలో నన్ను ఎగ్జైట్ చేయలేదు. అందుకే ఆలస్యమవుతోంది. కానీ త్వరలోనే బాలీవుడ్లో స్ట్రయిట్ సినిమా చేస్తా` అంటూ క్లారిటీ ఇచ్చాడు బన్నీ.