తెలుగులోనే కాదు ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్న టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి. ఈగ, బాహుబలి లాంటి సినిమాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రాజమౌళి, బాహుబలి 2తో బాలీవుడ్ సినిమాకు కూడా సాధ్యం కాని ఎన్నో రికార్డ్లను తిరగరాసి దర్శక ధీరుడు అనిపించుకున్నాడు. అదే జోరులో ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు కలిసి నటిస్తున్నారు.
ఈ జనరేషన్లో టాలీవుడ్లో తెరకెక్కుతున్న అవుతున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఇదే. అందుకే ఈ సినిమాను దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. మన్యం వీరుడు అల్లూరి సీతా రామ రాజు, తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం లు ఒకవేళ కలిసి ఉంటే అనే ఫాంటసీ కథాంశాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో దేశ విదేశీ నటులు నటిస్తున్నారు. ఈ సినిమా 2021 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా తరువాత అంతకు మించి అనేలా మరో భారీ మల్టీ స్టారర్ను ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు, నేషనల్ స్టార్ ప్రభాస్లు హీరోలుగా ఓ భారీ చిత్రానికి రంగం సిద్ధం చేస్తున్నాడట. ఇంత భారీ కాంబినేషన్లో సినిమా చేయాలంటే బడ్జెట్ మరింత భారీగా ఖర్చవుతుంది. మరి అంత పెట్టే నిర్మాతలు ఎవరు అన్న అనుమానాలు చాలా రోజులుగా ఉన్నాయి. అయితే తాజాగా సీనియర్ నిర్మాత కేయల్ నారాయణ, యూవీ క్రియేషన్స్తో కలిసి ఈ భారీ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు ఒకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేని ఈ సినిమా గురించి మరింత క్లారిటీ రావాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.