బాహుబలి తరువాత అదే స్థాయిలో సెన్సేషన్ సృష్టించిన దక్షిణాది చిత్రం కేజీఎఫ్ 2. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఘనవిజయం సాదించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం సంచలన విజయం సాధించటంతో ఇప్పుడు సీక్వెల్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యేది. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ కూడా మరింత భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్నారు.
తొలిభాగంలో యష్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించగా అర్చనా జోయిస్, అనంత్ నాగ్, రమేష్ ఇందిరా, రామచంద్ర రాజు, వినయ్, లక్షణ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాలో కథ అంతా సీనియర్ నటుడు అనంత్ నాగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సాగుతుంది. ఓ జర్నలిస్ట్కు అనంత్ నాగ్, కేజీఎఫ్ ను గెలిచిన రాఖీ భాయ్ కథను వివరిస్తున్నట్టుగా సినిమా స్క్రీన్ప్లేను తయారు చేసుకున్నాడు దర్శకుడు.
సీక్వెల్ లో కూడా అదే స్క్రీన్ప్లేను కొనసాగించాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం సీనియర్ నటుడు అనంత్ నాగ్ కేజీఎఫ్ టీంకు షాక్ ఇచ్చాడట. దర్శకుడితో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా అనంత్ నాగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే దర్శకుడు ఎవరి కోణంలో కథను నడిపిస్తాడన్న చర్చ మొదలైంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి తాజాగా అనంత్ నాగ్ తప్పుకున్నాడన్న వార్తలు వస్తుండటంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది చూడాలి.