ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు, మరో బిగ్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. చాలా కాలం తరువాత మహేష్ చేసిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ కావటంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబులు సంయుక్తంగా నిర్మించారు.
అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్ లోనే తన నెక్ట్స్ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు మహేష్ బాబు. తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నట్టుగా చెప్పాడు. వంశీ చాలా కాలంగా మహేష్తో సన్నిహితంగా ఉంటుండటంతో అంత ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అని భావించారు. కానీ అనూహ్యం మహేష్ ఈ సినిమాను పక్కన పెట్టేశాడని తెలుస్తోంది. వంశీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టుగా వార్తలు వస్తుండటంతో మహేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మళ్లీ చర్చ మొదలైంది.
అయితే తాజాగా మహేష్ నెక్ట్స్ సినిమాకు దర్శకుడు ఫిక్స్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. గతంలో మహేష్ హీరోగా సినిమా చేసేందుకు యంగ్ డైరెక్టర్ పరశురామ్ చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ మహేష్, వంశీతో సినిమా చేసేందుకు మొగ్గు చూపాడు. కానీ వంశీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావటంతో ఇప్పుడు పరశురామ్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట. అయితే ఇప్పటికే నాగ చైతన్య హీరోగా ఓ సినిమాను స్టార్ట్ చేశాడు పరశురామ్. మరి మహేష్ సినిమా కోసం ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెడతాడా..? లేక మహేష్ నాగచైతన్య సినిమా పూర్తయ్యే వరకు వెయిట్ చేస్తాడా చూడాలి.