భారత దేశంలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. సీఏఏ అనుకూల, వ్యతికేక వర్గాల మధ్య అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో ఇప్పటికీ 42 మంది చనిపోయారు. కేవలం మరణాలే కాదు ఎంతో మంది అనాధలుగా.. వికలాంగులుగా మారారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ట్రంప్ పర్యటన రోజు నుంచి ఈ ఆందోళనలు మరింత ఎక్కువ అయ్యాయి. ఈశాన్య ఢిల్లీలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. పౌరులు రోడ్ల మీదకు వస్తున్నారు. ప్రజలు ఉద్యోగాలు, కార్యాలయాలకు వెళ్తున్నారని, ట్రాఫిక్ కూడా సాధారణంగా ఉందని అధికారులు చెబుతున్నారు. కాకపోతే సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంకా భారీగానే బందోబస్తు కనిపిస్తుంది.
సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలు గుంపులుగా తిరగడం, సమావేశాలు ఏర్పాటు చేయడంపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర పారా మిలటరీ సిబ్బంది, రాష్ట్ర పోలీసులు పహారా కాస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పోగైన చెత్త, శిథిలాలను ఈశాన్య ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు తొలగించిందని హోం శాఖ తెలిపింది. మరోవైపు ఈ హింసాకాండలో గురించి యావత్ భారత దేశం ఒక్కసారే ఉలిక్కి పడింది. అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మరోవైపు ఇంటిలీజెన్స్ వర్గాలు అసాంఘిక శక్తులు ఈ హింసలోకి ప్రవేశించి ఉంటారని.. అలాంటి వారే ఇలాంటి దారుణాలకు పాల్పపడతారని అంటున్నారు.
దుండగులు దారుణంగా హత్య చేసి మురికి కాలువల్లో శవాలను పడవేసిన సంఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. ఇక ఢిల్లీ గొడవలు ఇప్పట్లో సర్ధుమణిగేలా లేవని... పోలీసులు బందోబస్తు బారీగా అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. హింస కారణంగా అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు మరికొంత సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు. అల్లర్ల కారణంగా 42 మంది చనిపోగా, వందల మంది గాయపడిన సంగతి తెలిసిందే. అలాగే, వందలాది దుకాణాలు, వాహనాలు, ఇళ్లను ఆందోళనకారులు తగుల బెట్టారు.