భారతీయుడు 2 సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం సినీ లవర్స్ని ఎంతగా కలచివేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిబ్రవరి 19,2020 రాత్రి ఈవీపీ ఫిల్మ్ సిటీలో ఈ ఘటన జరిగింది. షూటింగ్ లో భాగంగా భారీ క్రేన్ ఏర్పాటు చేయగా, ఆ క్రేన్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాంలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. డైరెక్టర్ శంకర్తో పాటు మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడే సెట్లో హీరో కమల్హాసన్తో పాటు హీరోయిన్ కాజల్ కూడా ఉన్నారు. అయితే ఈ కేసు విషయంలో కమల్, శంకర్ కి సమన్లు జారీ అయ్యాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇటీవల చిత్ర దర్శకుడు శంకర్ని పిలిచి విచారణ జరిపిన చెన్నై పోలీసులు నేడు కమల్ని విచారించనున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి కోటి రూపాయలు ప్రకటించారు కమల్ హాసన్. అంతే కాదు బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని.. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కమల్ హాసన్ ఈ చిత్రం నిర్మిస్తున్న లైకా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతనే షూటింగ్ కి హాజరవుతారని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విషయంలో కొద్ది సేపటి క్రితం కమల్ ఎగ్మూర్లోని పోలీస్ కమీషనర్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఆయనని పోలీసులు పలు కోణాలలో విచారించనున్నట్టు తెలుస్తుంది. ప్రమాద ఘటనలో కృష్ణ(34). మరో వ్యక్తి ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ (60). శంకర్ పర్సనల్ అసిస్టెంట్ 28 ఏళ్ల మధు మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. ఈ మూవీలో నటిస్తున్న హీరోయిన్ కాజల్ చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపి కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. తన తో అప్పటి వరకు షూటింగ్ లో పాల్గొన్నవారు ఇక లేరు అన్న విషయం తాను ఇప్పటికీ జీర్జించుకోలేకపోతున్నానని చెప్పారు.