ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుసగా చిన్న చిత్రాల జోరు పెరిగిపోయింది. కంటెంటె బాగుంటే ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని పలుమార్లు రుజువైంది. అయితే దర్శక నిర్మాతలు సైతం కొత్త వారితోనే ఎక్కువ చిత్రాలు తీయడానికి ఇష్టపడుతున్నారు. తక్కువ బడ్జెట్ తో మంచి కథ దొరికితే కొత్త నటులను పరిచయం చేస్తూ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది టాలెంట్ ఉన్న దర్శకులు కూడా వెండితెరకు పరిచయం అవుతున్నారు. గతంలో తరుణ్ భాస్కర్ చిన్న బడ్జెట్ తో విజయ్ దేవరకొండ హీరోగా ‘పెళ్లిచూపులు ’ తెరకెక్కించారు.
ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సందీప్ వంగా సైతం తక్కువ బడ్జెట్ తో ‘అర్జున్ రెడ్డి’ లాంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించారు. ఆ తర్వాత రాంగోపాల్ ప్రియ శిష్యుడు అజయ్ భూపతి కొత్త నటులు కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ తో తక్కువ బడ్జెట్ తో ‘ఆర్ ఎక్స్ 100 ’ చిత్రం తీసి మంచి విజయం అందుకోవడమే కాదు.. లాభాలు కూడా బాగా రాబట్టారు. ఇలా కంటెంట్ బాగున్న చిత్రాలు ప్రజలు బాగా ఆధరించడం బడ్జెట్ కి రెండింతలు లాభాలు రావడం చూస్తూను ఉన్నాం.
తాజాగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య, కరోన్య ప్రాధాన పాత్రలతో 'అసలు ఏం జరిగిందంటే' చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి అనిల్ బొద్దిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ బండారి మాట్లాడుతూ– ‘‘ఒక్క క్షణంలో మన జీవితంలో జరిగే మార్పును తెలిపే కథ ఇది. క్రైౖమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. ఫస్ట్ కాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. ఈ నెల 9వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి, నెలాఖరులో సినిమాను విడుదల చేస్తాము" అని చెప్పాడు.