ఈ వారం బాలీవుడ్ లోనూ కరోనా భయమే కనిపించింది. బాలీవుడ్ సినీ పరిశ్రమ కరోనా వ్యాప్తి కారణంగా అన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తోంది. ఇప్పటికే షూటింగ్ లతో పాటు ఇతర కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది బాలీవుడ్ సినీ పరిశ్రమ. బాలీవుడ్ యాక్షన్ మూవీ సూర్యవంశీ రిలీజ్ను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. షూటింగ్ లు మాత్రమే కాదు సినిమాలకు సంబంధించిన ఇతర కార్యక్రమాలన్ని వాయిదా వేస్తున్నారు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన అమెరికా టూర్ ను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించాడు. సల్మాన్ చాలా కాలంగా దబాంగ్ పేరుతో వివిధ దేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఏప్రిల్ మొదటి వారంలో అమెరికా, కెనడా దేశాల్లో సల్మాన్ షో చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఆ దేశాల్లో కరోనా ప్రభావం ఉండటంతో సల్మాన్ తన షోను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించాడు. కొత్త డేట్ ఎప్పుడన్నది ఇంకా చెప్పలేదు. బయోగ్రాఫికల్ మూవీగా తెరకెక్కిన 83 మూవీని కూడా వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కావాల్సి ఉంది.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐఫా అవార్డుల వేడుకను కూడా రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారా లోకం అంతా పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో కార్యక్రమం వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు నిర్వాహకులు. తాజాగా జరిగిన జీ సినీ అవార్డ్స్ కార్యక్రమానికి కూడా ప్రేక్షకులను అనుమతించలేదు. కేవలం స్టార్స్ మాత్రమే పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని తరువాత టీవీలో ప్రసారం చేయనున్నారు. ఈ అవార్డ్స్ లో రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన గల్లీ బాయ్ సినిమా సత్తాచాటింది. బెస్ట్ యాక్టర్ తో పాటు సాంగ్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ అవార్డ్ లను సొంతం చేసుకుంది ఈ సినిమా.