మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య... గతంలో వచ్చిన సైరా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ వ్యయంతో వ్యయప్రయాలకు ఓర్చి చారిత్రక నేపథ్యాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకిక్కించినప్పటికీ అభిమానులను అంతగా ఆకట్టకోలేకపోయింది. దీంతో తన తదుపరి చిత్రంపై సీరియస్ గా ఫోకస్ చేశారు మెగాస్టార్.. ఇందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో `ఆచార్య`ను తెరకెక్కిస్తున్నారు. ఓ సామాజిక ఇతివృత్తంతో రూపొందిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి డబుల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. ఇటీవలే కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్కు కొంత కాలం గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే..
అసలు విషయానికొస్తే ఆచార్య సినిమాను కష్టాలు వరుసగా వెంటాడుతున్నట్లు సమాచారం. కథానాయిక ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా త్రిషను అనుకున్నప్పటికీ, ఆమె అర్థాంతరంగా వైదొలిగారు. తాను చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు స్వయంగా ప్రకటించి చిత్ర యూనిట్కు షాకిచ్చారు. ఆ తర్వాత కాజల్ను సెలెక్ట్ చేసినప్పటికీ... భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆమెను కూడా పక్కనబెట్టారు. ప్రస్తుతం మరో హీరోయిన్ను వెతికే పనిలో చిత్రబృందం బిజీగా ఉంది. తాజాగా అనుష్కతో చిత్ర యూనిట్ సంపద్రింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతే గాక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించబోయే హీరో ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
మరోవైపు కరోనా కారణంగా చిత్ర షూటింగ్ ఆగిపోయింది. నిజానికి ఆగస్టులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దసరాకు కూడా విడుదల కష్టమేననే అభిప్రాయలు వినబడుతున్నాయి. దసరాకు రిలీజ్ చేయకపోతే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిందే. సంక్రాంతికి `ఆర్ఆర్ఆర్` విడుదలవుతోంది కాబట్టి అప్పుడు రిలీజ్ చేయడం కుదరదు. మరి, చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.