కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో జన జీవనం స్తంభించిపోయింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వినోదం.. ఇలా ప్రతీ వ్యవస్థ కుదేలైపోయింది. కరోనా విలయతాండవమే చేస్తున్నా ప్రజలందరూ కూడా ఎప్పుడూ చేయని పని చేస్తున్నారు. ఇంటిపట్టునే ఉండి ఫ్యామిలీతో గడుపుతున్నారు.. ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఇందులో సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
చిరంజీవి మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇదే విషయాన్ని చెప్తున్నాడు. తన ఇంటి ఆవరణలోని పచ్చని చెట్లను, ప్రకృతిని వీడియో తీసి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ‘అందమైన ప్రకృతిలో గడిపే సమయం దక్కినందుకు సంతోషంగా ఉంది. ప్రకృతిని ప్రేమిస్తూ పచ్చదనంలో సేద తీరడం మంచి అనుభవం’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సాయి ధరమ్ ను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
‘ఇన్నాళ్లూ ప్రకృతి నుంచి మనం తీసుకున్నాం.. ఇప్పుడు ప్రకృతి కోసం మనం చేయాల్సిన సమయం వచ్చింది’, ‘వీడియో చూస్తేనే మనసుకు హాయిగా ఉందిగా’, ‘నిజం చెప్పావు బ్రో’ అంటూ స్పందిస్తున్నారు. కెరీర్ పరంగా సాయి ధరమ్ రీసెంట్ గా ప్రతిరోజూ పండగేతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాలో నటించాడు. నభా నటేశ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కరోనా వల్ల విడుదల వాయిదా పడింది.
I’m grateful for we have given much needed space and time for nature to heal herself and us... #lockdownindia #WeAreInThisTogether #nature #love pic.twitter.com/f1abhREgQs
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 6, 2020