తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు నర్సింగ్ యాదవ్ కోమాలోకి వెళ్లారు.. ఈ విషయాన్నీ ఆమె భార్య చిత్ర యాదవ్ వెల్లడించారు. గురువారం సాయంత్రం 4 గంటలు సమయంలో నర్సింగ్ యాదవ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళారని, ప్రస్తుతం అతన్ని హైదరాబాదులోని సోమజిగూడా యశోద ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అంతేకాకుండా ఈరోజు ఉదయం కూడా ఆయనకు డయాలసిస్ చేయించామని ఆమె వెల్లడించారు. నర్సింగ్ యాదవ్ అనుకోకుండా కోమాలోకి వెళ్ళాడని, 48 గంటలు పాటు అబ్జర్వేషన్లో వైద్యులు ఉంచారని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పైన చికిత్స కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. అయితే.. నర్సింగ్ యాదవ్ ఇంట్లో కింద పడిపోయాడని, తలకి గాయం అయ్యిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె తెలిపారు.
ఈ విషయంపై సోషల్ మీడియా లో వస్తున్న తప్పుడు వార్తలను ఎవరూ నమ్మకండి అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ఆయన ఎక్కడా పడిపోలేదని, ఉన్నట్లు ఉండి కోమాలోకి వెళ్ళిపోయాడని ఆమె అన్నారు. త్వరగా కోలుకొని తను ఆరోగ్యంగా ఇంటికి రావాలని దేవుని ప్రార్థిస్తున్నామని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా.. నర్సింగ్ యాదవ్ తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి సుమారు 300 చిత్రాలకు పైగా నటించారు. విజయనిర్మల దర్శక నిర్మాతగా వచ్చిన హేమాహేమీలు చిత్రంతో వెండితెరకి ఆయన పరిచయం అయ్యారు. ఇక దర్శకుడు రాం గోపాల్ వర్మ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవి నటించిన ఎక్కువ సినిమాలలో నర్సింగ్ యాదవ్ నటించాడు. తనదైన నటనతో తెలుగు చిత్రసీమలో నర్సింగ్యాదవ్ ప్రత్యేక గుర్తింపును పొందారు. ప్రధానంగా తనదైన మాటతీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. అనేక సినిమాల్లో డైలాగ్ డెలివరీతోనే తన పాత్రకు ప్రాణం పోస్తాడు నర్సింగ్ యాదవ్. నర్సింగ్యాదవ్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ సినిమాల్లో నటించాలని తెలుగు చిత్రసీమ ప్రముఖులతోపాటు ఆయన అభిమానులు, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.