2018వ సంవత్సరం చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కేజీఎఫ్' చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా అలరించిన విషయం తెలిసిందే ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ దేశవ్యాప్త గుర్తింపును సంపాదించుకున్నాడు. కాగా ఈ దర్శకుడి తరువాత చిత్రం టాలీవుడ్ హీరోతోనే ఉండబోతున్నట్టు కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం సాగుతోంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రానున్న చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 'కేజీఎఫ్2' తర్వాత ఈ సినిమా ఉంటుందని సమాచారం. కాగా ఈ చిత్రంలో కథానాయకుడిగా తారక్ నటించే అవకాశముందని తెలుస్తోంది. దర్శకుడు తయారు చేసుకున్న కథకు యంగ్ టైగర్ ఐతేనే న్యాయం చేయగలడని దర్శకుడు భావిస్తున్నాడట.
ఈ కథ ఎన్టీఆర్కు కూడా నచ్చి ఓకే చేస్తే ప్రశాంత్ తెలుగులో తీయబోయే తొలిచిత్రం ఇదేకానుంది. అంతేకాదు. మరో ఆసక్తికరమైన కాంబినేషన్ ప్రేక్షకులను అలరించబోతుందన్నమాట. నిజానికి ‘జనతా గ్యారేజ్’ నిర్మిస్తున్న సమయంలోనే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ యంగ్ టైగర్తో మరో సినిమా తీసేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే ఆ తరువాత తారక్ ముందుగా తనకున్న కమిట్మెంట్ ప్రకారం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం షూటింగ్లో బిజీ అయిపోయాడు. ఈ నేపథ్యంలోనే అటు ప్రశాంత్ కేజీఎఫ్ -2 పూర్తి చేసే సమయానికి, తారక్ కూడా జక్కన్న సినిమా నుంచి ఫ్రీ అయ్యే అవకాశముందని, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయంటూ ఫిల్మ్నగర్ వర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్, అన్ని వ్యాపారాలు దెబ్బతినడం, ఈ ప్రభావం సినిమా రంగంపై కూడా తీవ్రంగా పడిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కడం సాధ్యం కాదేమోనన్న రూమర్లు తాజాగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం మైత్రీ మూవీ మేకర్స్ వారు గతంలో మాదిరిగా ఏకకాలంలో రెండు మూడు భారీ సినిమాలు తీసేందుకు సిద్ధంగా లేరని వార్తలు వస్తున్నాయి. అయితే 'కేజీఎఫ్ 2' తరువాత ప్రశాంత్ మరింత క్రేజీ డైరెక్టర్గా మారడం ఖాయమని, ఇటు ఆర్.ఆర్.ఆర్ తరువాత తారక్ క్రేజ్ కూడా పీక్స్లో ఉంటుందని కాబట్టి ఈ కాంబోలో చిత్రం ఆగిపోయే అవకాశం లేదని తెలుస్తోంది. ఏ కారణంగానైనా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్ర నిర్మాణం నుంచి వైదొలిగితే జూనియర్ స్వయంగా తానే నిర్మాతగా ఈ ప్రాజెక్టును భుజాలకెత్తుకునే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేమని చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.