టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, కేరళలో కూడా ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. టెంపర్ సినిమా నుంచి వరుస విజయాలతో ఎన్టీఆర్ జోష్ మీదున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్లో కూడా పెద్దగా వివాదాలు ఏమీ లేవు. 
 
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా గతంలో ఎప్పుడూ హద్దులు దాటిన సందర్భాలు లేవు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన ఒక పని ఎన్టీఆర్ కు తలనొప్పిగా మారింది. వాళ్లు నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్సో కాదో చెప్పలేము కానీ వాళ్లు చేసిన పని మాత్రం ఎన్టీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ అభిమానులకు, నటి మీరా చోప్రాకు సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. . జూనియ‌ర్ అభిమానులు అత్యాచార బెదిరింపుల‌కు దిగుతున్నారంటూ మీరా చోప్రా పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. 
 
మీ అభిమాన తెలుగు హీరో ఎవరు అని అభిమానులలో ఒకరు అడగగా మహేష్ బాబు తనకు ఇష్టం అని చెప్పింది. అదే సమయంలో మరొకరు ఎన్టీఆర్ గురించి అడగగా ఎన్టీఆర్ ఎవరో తనకు తెలీదని కామెంట్ చేసింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. మీ పేరెంట్స్ క‌రోనాతో చ‌నిపోనూ, గ్యాంగ్ రేప్ చేస్తాం, చంపేస్తాం అంటూ బెదిరించారు. దీంతో షాక్ అయిన మీరా వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఇలాంటి అభిమానులతో ఎలా నెగ్గుకురాగ‌ల‌రో తెలపాలని జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ట్విటర్‌లో ప్రశ్నించింది. ఎన్టీఆర్ ఈ వివాదంపై స్పందిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు తప్పు చేసినా, చేయకపోయినా తన తరపున మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని ఒక సందేశం ఇవ్వాల్సి ఉంది. ఈ వివాదం గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఒక ప్రకటన వెలువడితే బాగుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: