తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడిగా జయం మనదే ఫేం శంకర్ ఎన్నికయ్యారు… ఇక ప్రధాన కార్యదర్శిగా రాంప్రసాద్, కోశాధికారిగా కాశీ విశ్వనాథ్, ఉపాధ్యక్షుడగా రవికుమార్ చౌదరి, సహాయ కార్యదర్శిగా కట్టా రంగారావు లు కూడా ఎన్నికయ్యారు.. ఈ సందర్భంగా ఈ నూతన కార్యవర్గం మంత్రి జగదీష్ రెడ్డిన ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు.
తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్లో జరిగాయి. ఎన్.శంకర్, సానా యాదిరెడ్డి అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. 759 ఓట్లకి గానూ ఎన్.శంకర్కి 518 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రత్యర్థిపై 310 ఓట్ల మెజారిటీతో ఎన్.శంకర్ అధ్యక్షుడిగా గెలుపొందారు. సానా యాదిరెడ్డి ప్యానల్ నుండి ఇ.సి మెంబర్స్గా పోటీ చేసిన తొమ్మిదిమంది సభ్యుల్లో కృష్ణమోహన్ ఒక్కరే విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా వారిని అభినందించిన మంత్రి మాట్లాడుతూ… జయం మనదేరా వంటి సామాజిక స్ఫూర్తిని కలిగించిన సినిమాలకు దర్శకత్వం వహించిన తెలంగాణలోని నల్గొండ ప్రాంతానికి చెందిన శంకర్ తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికవ్వడం అభినందనీయమన్నారు. శంకర్ ఇంకా మరిన్ని సామాజిక సినిమాలకు దర్శకత్వం వహిస్తూ సమాజానికి స్ఫూర్తిని కలిగించాలని మంత్రి కోరారు.
కాగా, తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం నూతన కార్యవర్గం ఆదివారం మధ్యాహ్నం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు మంత్రి జగదీశ్వర్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిశారు..ఈ సందర్శంగా నూతన కార్యవర్గాన్ని మంత్రులు అభినందించారు.