తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి గొప్ప నటులతో పోటీ పడి నటించి..తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు మహానటి సావిత్రి. కేవలం కళ్లతోనే హావభావాలు పలికించే గొప్ప నటి సావిత్రి. అందుకే తెలుగు ఇండస్ట్రీ ఉన్నంత కాలంగా ఆమెను ఎంతో మంది వర్థమాన నటీమణులు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సీనీ తారలపై ఎలాంటి బయోపిక్ చిత్రాలు రాలేదు. మొదటి సారిగా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో కీర్తి సురేష్ లీడ్ రోల్ లో ‘మహానటి’ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్ వర్క్ లో పడ్డారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో చిత్రంలోని ఒక్కో పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, సమంత ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక సావిత్రి లుక్ లో కీర్తి సురేశ్ ఎలా వుండనుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సావిత్రిగా కీర్తి సురేశ్ ఫస్టులుక్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు.
ఈ ఫస్ట్ లుక్ చూస్తే నిజంగా ఒక్కసారి షాక్ అవుతారు..అచ్చం సావిత్రి ఫోటోనే అనుకునేట్టుగా ఉంది కీర్తి సురేష్. సావిత్రి లుక్ తో కీర్తి సురేశ్ ను సగ భాగం మాత్రమే చూపించినా, ఈ పాత్రకి ఆమె కరెక్టుగా సరిపోయిందని ఎలాంటి సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్ కొద్ది సేపట్లో రానుంది..ఈ సందర్భంగా ‘మహానటి’ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచుతుంది. మే 9వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.