టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి.. సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక తానే ఉన్నానంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించడంతో సినీపరిశ్రమలో తీవ్ర దుమారం రేపింది. అల్లు అరవింద్ కామెంట్స్పై స్పందించిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను చేసింది నూటికి నూరు శాతం క్షమించరాని తప్పు అని చెప్పారు. మళ్లీ ఇంకొకసారి అల్లు అరవింద్కు, పవన్ కళ్యాణ్కి, మెగా కుటుంబ సభ్యులకీ, ఫాన్స్కీ అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నానన్నారు.
అంతే కాకుండా మళ్లీ ఎప్పుడూ పవన్ మీద కానీ, మిగతా ఫ్యామిలీ మెంబెర్స్ మీద కానీ నెగిటివ్ కామెంట్స్ పెట్టనని తన తల్లి మీద, తన వృత్తి మీద ఒట్టేసి చెబుతున్నానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వర్మపై పవన్ అభిమానులతో పాటు కొందరు సినీప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేయగా, వర్మపై చర్యలు తీసుకోవాలని మెగా ఫ్యామిలీతో కలిసి ఫిలిం ఛాంబర్ ఎదుట పవన్ ఆందోళనకు దిగారు.
అనంతరం న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై పవన్ లాయర్లతో కలిసి చర్చించారు. కాగా, ఈ విషయంపై మరోసారి వర్మ ఆవేదనకు లోనయ్యారు. తాజాగా మరోసారి ఆ ఒట్టు తీసి గట్టున పెట్టారు వర్మ. దానికి కారణం కూడా వర్మ వివరించారు. ‘‘నేను చేసిన పనికి సారీ చెప్పి పీకే మీద ఇక కామెంట్ చెయ్యనని మా అమ్మ మీద ఒట్టు వేశాను. ఆ తర్వాత కూడా నేను చంద్రబాబు, లోకేష్, శ్రీని రాజు, ఆర్కే, రవిప్రకాష్, మూర్తి కూటమిలో ఉన్నానని ఆరోపించడం మూలాన మా అమ్మ అంగీకారంతో ఇప్పుడు నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టాను’’ అని ఆర్జీవీ వెల్లడించారు.
మరో ట్విట్ లో ‘‘లాయర్ల కంటే ఎక్కువగా ఒక వ్యక్తి మాట్లాడటం నేను మొదటి సారి చూస్తున్నా. ఆయనకు ఉన్న డబ్బుతో ఒక మంచి లాయర్ను నియమించుకోలేకపోయారా అని ఆశ్చర్యమేసింది. లేదంటే ఆయన ఫ్యాన్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ గోడౌన్ నుంచి లాయర్ కోట్లు వేసుకుని వచ్చారా’’ అంటూ ట్వీట్ చేశారు.