గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాత, భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అధినేత దివంగత ఎస్.గోపాల్ రెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాలకృష్ణ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎస్. గోపాల్రెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి మృతిపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
నెల్లూరు జిల్లా వాకాడ మండల పంబలి సముద్ర తీరంలో ఆయన మృతదేహం కొట్టుకువచ్చింది. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. భార్గవ్ రెడ్డి మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడు ఎలా చనిపోయాడనే దాని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోయాడా, మరేదైనా కారణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. మరోవైపు, ఒక కుక్క పిల్లను కాపాడేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ఆయన మరణించినట్టు కొందరు పేర్కొన్నారు.
భార్గవ్ మరణంతో సినీ పరిశ్రమలో విషాదం అలముకుంది. పలువురు సినీ ప్రముఖులు గోపాల్ రెడ్డి కుటుంబానికి తమ సంతాపం తెలిపారు. కొడుకు భార్గవ్ పేరు మీదే భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ను స్థాపించిన గోపాల్ రెడ్డి.. బాలకృష్ణ, కోడి రామకృష్ణలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 2008లో గోపాల్రెడ్డి మరణం తరువాత ఆయన కుటుంబసభ్యులెవరు ఇండస్ట్రీలో కొనసాగలేదు.