తెలుగు ఇండస్ట్రీలో కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం, స్పైడర్ రెండు భారీ డిజాస్టర్ అయ్యాయి. తర్వాత మరోసారి కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘భరత్ అనే నేను’ తో మంచి విజయం అందుకున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. మహేష్ బాబు ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. స్టైలిష్ సీఎంగా మహేష్ నటన ఆకట్టుకుంది. రాజకీయ నేపథ్యం ఉన్నపటికీ ఈ చిత్రంలో దర్శకుడు కొరటాల కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూడుకున్నాడు.
ఇప్పటికీ భరత్ అనే నేను చిత్రం మంచి వసూళ్లతో రన్ అవుతోంది. ఈ చిత్రంలో ట్రాఫిక్ సమస్య, ప్రభుత్వ విద్యావిధానం, లోకల్ గవర్నెన్స్ వంటి అంశాలని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. వివాదాలకు చోటు లేకుండా దర్శకుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భరత్ అనే నేను చిత్రం చిన్నపాటి వివాదంలో చిక్కుకుంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఉపయోగించిన నవోదయం పార్టీ తమదే అని ఆ పార్టీ అధ్యక్షుడు దాసరి రాము ఆరోపిస్తున్నారు. ఇందులో ఉపయోగించిన గుర్తు కూడా తమదే అని దాసరి రాము అంటున్నారు. తమ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు కూడా ఉందని, అలాంటి పార్టీని చిత్రాల్లో ఎలా వాడుకుంటారని దాసరి రాము అంటున్నారు. దీనిపై చిత్ర నిర్మాత, దర్శకుడికి నోటీసులు పంపబోతున్నట్లు ఆయన తెలిపారు.
గతంలో ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ, నాయకుడిని కానీ టార్గెట్ చేసే విధంగా ఈ చిత్రంలో డైలాగులు,సన్నివేశాలు లేవు. కేవలం ప్రజలు ఆలోచించేలా మాత్రమే చిత్రాన్ని రూపొందించినట్లు కొరటాల చెప్పిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై దర్శక, నిర్మాతలకు నోటీసులు పంపనున్నట్టు దాసరి రాము పేర్కొన్నారు