మహనటి సినిమా సావిత్రి బయోపిక్ అనే కంటే సావిత్రికి అద్భుత ట్రిబ్యూట్ గా, నివాళిగా చెపితే సరిపోతుంది. జెమిని గణేషన్ పై వ్యామోహంలో సావిత్రి ఆయనను వివాహం చేసుకొంది. మహానటి సావిత్రి జీవితంలోని, ప్రతికూల అంశాలన్నింటిని సానుకూల అంశాలుగా మార్చి చెప్పినట్లు సినిమా చూసిన తర్వాత అర్ధమైంది.
ఆమె తీసుకున్న కొన్ని
నిర్ణయాలను ప్రపంచాన్ని ఏకీభవించేటట్టు చేయడం జరిగింది. అందుకే నాటి ప్రేక్షకుల్లో ప్రతి
ఒక్కరి జీవితంలో నటిగా ఆమె స్థానం ఆరాధనీయమే.
బయోపిక్ అని చెప్పాలంటే సావిత్రితో కొంత మనస్పర్ధలున్న భానుమతి పాత్రను, అలాగే అటు బానుమతితో ఇటు సావిత్రితో సన్నిహిత సంబంధాలున్న జమున పాత్రను, అంతేకాదు సావిత్రి సినీ జీవితం వెలుగులీనే రోజుల్లొనె యువకథానాయికగా ప్రముఖ స్థానంలో ఉన్న వాణిశ్రీ పాత్రను, సినిమా నుంచి తప్పించేశారు. అన్నింటిని మించి తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య అభి మాన గయ్యాళి అత్త సూర్యకాంతమ్మతో సావిత్రి సాన్నిహిత్యం చిరస్మరణీయం. మహానటిలో అంతటి విలువైన ఆమె ప్రస్థావన లేక పోవటం, అంజలీ దేవి, చాయాదేవి పాత్రలు లేకపోవటం కూరలో కరేపాకు సువాసనలు లేకుండా ఉన్న మహానటి సినిమాని బయోపిక్ అనలేము.
ఇక జెమిని గణేషన్ తో సావిత్రి పరిచయానికి ముందే సహజీవనం చేసిన పుష్పవల్లి, ఆమెకు జెమిని గణేషణ్ కు జన్మించిన ప్రఖ్యాత బాలీవుడ్ కథానాయకి రేఖను ఏమాత్రం మన తలపుల్లోకి రానీయలేదు.
సినిమాల్లోకి రాకముందే తొలినాళ్లలోనే సాంప్రదాయ బద్దంగా పెళ్ళై, ఆ తరవాత సినీరంగంలోకి ప్రవేసించిన కొత్తలోనే, మరో స్త్రీతో సహజీవనం చేస్తున్న జెమిని గణేషణ్ తో ఎందుకు ప్రేమలోపడిందనేది సావిత్రిని ప్రపంచం ప్రశ్నించిన విషయం.
ఆ చర్చకు ఆస్కారం ఇవ్వకుండా, ఆమె జీవితాన్ని వివాస్పదం చేయకుండా, దాన్ని ఆమెపై ప్రేక్షకులకున్న ఆరాధన అనే విషయంతో పాతరేసి, సినిమా నిర్మించిన సావిత్రి సినిమా నిర్మించాలన్న తపన దర్శకుని అభిమతంగా కనిపించటం వలన, ఈ సినిమాను ఆమె జీవిత కథ (బయోపిక్) గా కాకుండా, ఆమెకి ఒక నివాళి, శ్రద్దాంజలిగా భావించవలసిందే.
అందుకే ఈ “మహనటి” సినిమాను సావిత్రికి “ట్రిబ్యూట్” గా భావిస్తే మంచిది. “బయోపిక్” గా చెప్పాలంటే ఇంకా ఎన్నో కవర్ చేయని అంశాలను కవర్చేయవలసి వస్తుంది.
సావిత్రి జీవితంలో ఎక్కువ భాగం అంటే 75% రీల్-లైఫ్ ని ప్రేక్షక హృదయాలలో ముద్రవేసి, నిలిచినంతవరకు యదార్ధంగా చూపి, మిగిలిన 25% రియల్-లైఫ్ లోని వివాదాస్పద అంశాల జోలికి పోకుండా, వివాదాలకు దూరంగా ఉండే అంశాలకు మాత్రం ప్రాధాన్యత ఇస్తూ దర్శకుడు కొంత సమయస్పూర్తిని ప్రదర్శించి నిర్మించటం సినిప్రేక్షక హృదయాలకు హత్తుకునే లాగా చేసింది.
ప్రత్యేకించి సావిత్రి నటజీవితంలో నందమూరి తారక రామారావుతో జొడీకట్టి నటించిన సినిమాలే ఆమె కీర్తిని నింగిని తాకిం చాయి. ఆమె రామారావు తో సోదరిగా, భార్యగా, వదినగా ఇతర ఎన్నో పాత్రల్లో నటించింది. అంతటి ప్రసిద్ధ పాత్రను దాదాపు స్పృజించలేదనే చెప్పాలి. నందమూరి తారక రామారావు పాత్రను పోషించ కుండా తిరస్కరించటం తారక్, అవివేకమనే చెప్పాలి. నటుడిగా అది ఆయన బాధ్యత.
తారక్ ఎంతటి గొప్పనటుడైనా, రెపు ఎవరైనా నిర్మాత దాన వీర శూర కర్ణ తీస్తాను నటించమంటే అందులో నటించకపోతే ప్రేక్షకులు తప్పుపడతారు. భవిష్యత్ లో నందమూరి పాత్రలను పోషించవలసి రావచ్చు. ఆ సామర్ధ్యం ఉండీ అవివేకంతో వదిలేసిన తారక్ లోని వివేకం సర్వదా ప్రశ్నార్ధకమే.
ఇక సావిత్రిగా నటించిన కీర్తి సురెష్ లో సావిత్రి ఆత్మపరకాయ ప్రవేశం చేసి తనకై తాను పునఃర్జన్మగా సంతరించుకుని కీర్తి సురేష్ కు ఘన కీర్తిని బహుమతిగా ఇచ్చేసింది. కీర్తి సురేష్ నటన అనితర సాధ్యం అని చెప్పాల్సిందే.
జెమిని గణేషణ్ గా దుల్కర్ సల్మాన్ నటించటం వలననే జెమిని గణేషన్ పాత్రలోని ప్రతికూల అంశాలన్నీ సానుకూల అంశాలుగా మారిపోయి, జెమిని గణేషన్ స్త్రీ-లోలుడు అన్న ముద్ర చెరిగిపోక పోవటం ఆ పాత్రగతి అంతే. మానవ సంబంధా లన్నీ ఆర్ధిక సంబందాలేనని సావిత్రి-జెమినిల జీవితం దగ్గరుండి చూసిన వారికి తెలుసు. కాని దాన్ని స్పృజించక పోవటానికి కారణం వారి పిల్లలతో సినిమా నిర్మించటానికి ఏర్పాటు చేసుకున్న ఒప్పందంలో భాగం కావచ్చు. జెమిని గనేషన్ సావిత్రిని ముందుగా ఆర్ధికంగా దివాళా తీయించిన వ్యక్తని నాడు పత్రికలన్నీ కోడై కూశాయి.
ఒక్క ముక్కలో చెప్పాలంటే మహానటి సినిమాలో పాత్రదారులు అసలు పాత్రదారులే అన్నంత గొప్పగా నటించారు. ఏవరూ సామాన్యంగా నటించలేదు అంతా 'అనన్యసామాన్యం' గా నటించేశారు. ఎవరిని ఏ పాత్రధారినీ అసలు వంకపెట్టటానికి వీలే కనిపించలేదు. తెరముందు ఎంత గొప్పగా ఉందో తెరవెనుక 'సాంకేతిక విలువలు, కడుంగడు రమణీయమే.
ఇకపోతే ఇంత గొప్పగా సినిమా నిర్మించటంలో నాగ్ అశ్విన్ కు నైపుణ్యమున్నా, 1942 నాటి కథను అంతకుమించి కెవిరెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, ఎల్వి ప్రసాద్ లాంటి దిగ్దర్శకుల మన్ననలు పొందిన సావిత్రి జీవిత కథను సినిమాగా నిర్మించాలంటే ముఖ్యంగా వయసు చాలదు. అందుకే సినిమా దర్శకత్వం నేపద్యంలో చలసాని అశ్వినీదత్ నీడగా కనిపిస్తున్నారు.
నాగ్ అశ్విన్ లో ఆ పరిణితి ఉన్నా, ఒక స్థాయికి తీసుకెళ్ళటానికి ఆ మాత్రం సహకారం తీసుకోవటం అవసరమే. మొత్తం మీద అత్యద్భుత నటన తో తెలుగు తమిళ ప్రేక్షకుల హృదయాంతరాళ్ళలో నిలిచిన సావిత్రి , ఆమె అమృతైక మూర్తికి పెద్ద పీఠవేసి, ఆమె గొప్ప వ్యక్తిత్వానికి స్పూర్తిని ఆపాదించి గౌరవభంగం లేకుండా నిర్మించినందున ఈ సినిమా, సావిత్రికి "ఘన నివాళి" గా చెప్పదగిన చిత్రరాజం గా చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది.
సమంత నటనలో పరిపక్వత పెరిగింది. తెలుగుసినిమా కూడా ఈ సినిమాతో పరిపక్వత సంతరించుకుంది.
చివరిగా ఒక మాట, సావిత్రి ని కలల రాణిగా చూసిన మాతరం నుండి ఆమె గుఱించి ఈ సినిమాతో తెలుసుకుంటున్న యువ తరం వరకు ఈ సినిమా వీక్షించిన వారిని, నిడివి ఇంకో అరగంట పొడిగించినా చూడగలరా? అని అడిగినప్పుడు అందరి సమాధానం ఏంటో తెలుసా? ఇంకో గంటైనా మాకు ఆమోదమే అనటం.
సావిత్రి నటనను కీర్తి సురెష్ అనే దర్పణంపై అద్భుతంగా ప్రతిబింబింప జేసిన నాగ్ అశ్విన్ కు తప్ప, వేరెవరైనా ఇంత గొప్పగా ఈ సినిమాకు ఈ తరంలో దర్శకత్వం వహించలేరు. దర్శకత్వ నైపుణ్యం మాత్రం అనితర సాధ్యమైనదని చెప్పక తప్పదు.