తింటే గారెలు తినాలి..వింటే భారతం వినాలి అన్న సామెత అందరికీ తెలిసిందే. అయితే మహాభారంతో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి..అందుకే చరిత్రలో మహాభారతానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అంతే కాదు మహాభారతంలో రాజకీయ కుట్రలు..జీవిత సత్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. భారత దేశంలో మహాభారతంపై ఎన్నో సీరియల్స్, సినిమాలు వచ్చాయి. కాకపోతే ఎప్పుడు తీసినా ఎదో ఒక కొత్తదనం ఇందులో దాగి ఉంటుంది. తాజాగా మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ `మహాభారతం 3డి` ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్న సంగతి తెలిసిందే.
దాదాపు 10ఏళ్ల పాటు ఐదు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు అమీర్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రొడ్యూసర్ రిలయన్స్ అంబానీ..అందుకే ఈ చిత్రం కోసం వెయ్యి కోట్లు అవలీలగా ఖర్చు చేయబోతున్నారు. అందుకోసం అమీర్, అంబాని ల మద్య ఒప్పందం కూడా కుదిరినట్లు సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాని అటు చైనా మార్కెట్లోనూ రిలీజ్ చేసేందుకు భారీ ప్రణాళిక సాగుతోంది. ఆ క్రమంలోనే ఈ ప్రాజెక్టుపై అంతకంతకు భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అమీర్ కీలక పాత్రధారుల ఎంపిక పనిలో ఉన్నారు.
ఈ చిత్రంలో దృతరాష్ట్రుని పాత్రలో బిగ్బి అమితాబ్ బచ్చన్ నటిస్తే బావుంటుందని అమీర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను కర్ణుడు లేదా కృష్ణుడు పాత్రలో నటించే అవకాశం ఉందని హింటిచ్చాడు. కానీ ఇప్పుడు అమీర్ మనసు మార్చుకున్నాడట..శ్రీకృష్ణుడి పాత్రలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తే ఆ పాత్రకు మంచి క్రేజ్ ఉంటుందని భావించారట.
సల్మాన్ సైతం మహాభారతం తీస్తే ఆ పాత్రలో నటిస్తానని ఇదివరకూ అనడంతో అమీర్ ఆ పాత్రకు తననే అడగాలని భావిస్తున్నారట. ఇకపోతే ఈ చిత్రంలో అమీర్ అర్జునుడిగా నటిస్తారని ప్రచారమవుతోంది. అయితే కర్ణుడి పాత్రకు ఎవరిని ఎంపిక చేశారు? అన్నది తెలియాల్సి ఉంది.