బాలీవుడ్ తారలు రణ్బీర్ కపూర్, ఆలియాభట్ ప్రేమలో మునిగి తేలుతున్నారనే వార్త చాలా రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వార్తకు బలం చేకూరేలా వారిద్దరూ చెట్టాపట్టాలేసుకొని మీడియా కంటపడ్డారు. ఆ మద్య ఆలియా.. రణ్బీర్ను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పారు. ఈ మాటను ఆలియాకు మెంటార్ అయిన ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ 2013లో నిర్వహించిన 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో వెల్లడించారు.
'తొలిసారి రణ్బీర్తో మాట్లాడిన క్షణం నాకు ఇప్పటికీ గుర్తే. 'రాక్స్టార్' సినిమా విడుదలయ్యాక మీరు(కరణ్) రణ్బీర్కు ఫోన్ చేసి మాట్లాడమని నాకు ఇచ్చారు. కానీ, నేను ఏం మాట్లాడాలో తెలీక చెత్తగా వాగేశాను. నా మాటలు వింటూ రణ్బీర్ 'ఓకే ఓకే' అంటూనే ఉన్నారు. ఆ తర్వాత రణ్బీర్తో కలిసి బయటికి వెళ్లాను. ఇప్పటికీ అతనంటే ఇష్టం. నాకు ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఉంది' అన్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి బ్రహ్మస్త్ర చిత్రంలో నటిస్తున్నారు.
దాంతో రెస్టారెంట్లకు, పార్టీలకు కలిసే వెళుతున్నారు. దీని గురించి మీడియా అడిగితే..‘సినిమా చేస్తున్నాం కాబట్టి ప్రచారం కోసం కలిసే వెళతాం. అయితే రణ్బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ పెట్టిన ట్వీట్ చూస్తే ఇద్దరికీ పెళ్లి లగ్నం కుదిరిందా? అన్న సందేహం కలగకమానదు. ఇంతకీ రిషి ఏం ట్వీటారంటే.. ‘భట్ కుటుంబం(బంధువులు)లో మహేశ్ భట్, ముఖేశ్ భట్, రాబిన్ భట్, పూర్ణిమ, సోనీ భట్, పూజా భట్, ఇమ్రాన్ హష్మీ, ఆలియా భట్లతో కలిసి పనిచేశాను. అందరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
అయితే ఇప్పుడు రిషి ఉన్నట్టుండి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఇరు కుటుంబాలు వియ్యంకులు అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీని గురించి ఆలియా తండ్రి మహేశ్ భట్ ఏం సమాధానమిస్తారో వేచి చూడాలి.