ఈ మద్య బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ పై కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కృష్ణ జింక, హిట్ అండ్ రైడ్ కేసులతో సతమతమవుతుంటే..కొత్తగా అమెరికాలో మరో కొత్త కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. సల్మాన్ ఖాన్ సహా నటి కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, రణ్వీర్ సింగ్, ప్రభుదేవా తదితరులపై అమెరికాలో కేసు నమోదైంది.
ఇల్లినాయిస్లోని నార్తరన్ డిస్ట్రిక్ట్ కోర్టులో చికాగోకు చెందిన వైబ్రెంట్ మీడియా గ్రూప్ పేరుతో కేసు దాఖలైంది. తమ వద్ద డబ్బులు తీసుకొని ప్రదర్శన ఇవ్వకుండా..డబ్బులు ఇవ్వకుండా ఈ స్టార్లు మోసం చేశారని వారి ఆరోపణ. దీనికి సంబంధించిన భారతీయ అమెరికన్ ప్రమోటర్ ఒకరు కేసు దాఖలు చేశారు.
వీరితో పాటు అక్షయ్ కుమార్తోపాటు గాయకులు ఉదిత్ నారాయణ్, అల్కా యాజ్ఞిక్, ఉషా మంగేష్కర్లపైనా కేసు దాఖలైంది. అలాగే, నటులతోపాటు వారి ఏజెంట్లు అయిన మ్యాట్రిక్స్ ఇండియా ఎంటర్టైన్మెంట్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, యశ్రాజ్ ఫిల్మ్స్ ప్రైవేటు లిమిటెడ్లపై మోసం కేసు దాఖలైంది.
ఫిర్యాదులో.. ‘వందేళ్ల సినిమా పండుగ’ సందర్భంగా సెప్టెంబరు 1, 2013లో నటులతో ప్రదర్శన ఇప్పించేందుకు వైబ్రెంట్ మీడియా గ్రూప్ నటులతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇదిలా ఉంటే..కృష్ణ జింక కేసులో చిక్కుకున్న సల్మాన్ భారత్ వదిలి వెళ్లే అవకాశాలు లేకపోవడంతో షోను వాయిదా వేశారు. ప్రదర్శన కోసం వైబ్రెంట్ మీడియా సల్మాన్కు 2 లక్షల డాలర్లు, కత్రినాకైఫ్కు 40 వేలు , సోనాక్షికి 36 వేల డాలర్లు చెల్లించింది. షో రద్దు అయినప్పటికీ తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వకపోవడంతో వైబ్రెంట్ మీడియా కోర్టుకెక్కింది.