ఇంటి నిండా హీరోలే - అందులో సగం అల్లుళ్ళు - మెగాస్టార్ కు ప్రతిసారీ చిక్కులే. "విజేత" పేరుతో తెరకెక్కిన సినిమా ద్వారా చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ తెరంగేట్రం చేస్తున్నాడు. ఆ సినిమా జూలై 6న విడుదలకు సిద్ధం అవుతోంది. మరోవైపు చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన "తేజ్ ఐ లవ్యూ" కూడా జూలై 6న విడుదల అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. వాస్తవానికి "తేజ్" జూన్ ఆఖరి వారంలో విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాల రీత్యా వాయిదా వేశారు.
"విజేత" నిర్మాత సాయి కొర్రపాటికి "ఈగ" సినిమా అదే రోజున విడుదలై ఘన విజయం సాధించిన సెంటి మెంట్ ఉంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "ఈగ" సినిమా జూలై 6, 2012న విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో "విజేత" ను కూడా అదే రోజు విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నాడట. సాధారణంగా మెగా హీరోల సినిమాలు రెండూ ఒకే వారంలో విడుదల కాకుండా జాగ్రత్త పడటం వారి అలవాటు.
కానీ ప్రస్తుతం చిరు మేనల్లుడు, చిన్నల్లుడు ఇద్దరూ నటించిన సినిమాలు థియేటర్స్ లోకి ఒకే రోజు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీరిద్దరిలో "తేజ్ ఐ లవ్యూ" వెనక్కి తగ్గుతాడా? లేదంటే కల్యాణ్ దేవ్ సినిమానే మరో తేదీకి మారతాడా? అనే అంశం ఆసక్తికరంగా మారింది. కానీ తమ సినిమాల మీద నమ్మకంతో రెండింటిని ఒకే రోజు విడుదల చేస్తే, మెగా ఫ్యాన్స్ ఎటు మొగ్గు చూపుతారో? చూడాలి మరి. గతంలో "తొలిప్రేమ" తో "ఇంటిలిజెంట్" పోటీ పడి ధారుణంగా ఫ్లాప్ అయ్యింది.
అప్పుడే చిరంజీవి సీరియస్ అయ్యారు. మరి ఇప్పుడు కూడా మెగాస్టార్ జోక్యం చేసుకోవాల్సి వస్తుందా? ఇలా జరుగుతూ ఉంటే చిరంజీవికి ఈ అల్లుళ్ళు పెద్ద గిల్లుళ్ళు అయ్యే అవకాశాలే ఎక్కువ. మందెక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంది. అలాగే ఫాన్స్ కూడా ఇబ్బందుల్లో పడతారు ఎవడికి సపోర్ట్ చెయ్యాలో తెలియక "మంద ఎప్పుడూ గుదిబండే" అందుకే కొందరినైనా మరో రంగంలోకి పంపితే చిరంజీవికి మంచిది.