ఈ సంవత్సరం ఫెమీనా మిస్ ఇండియాగా తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల ముద్దుగుమ్మ అనుకీర్తి వాస్ ఎంపికైంది. ఫెమీనా మిస్ ఇండియా కిరీటం దక్కించుకోవడానికి పలు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అందగత్తెలు వచ్చారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి చిత్ర నిర్మాత కరణ్ జోహార్, నటుడు ఆయుష్మాన్ ఖురానా ముఖ్య అతిథులుగా హాజరైన మిస్ ఇండియా ఫైనల్స్ పోటీల్లో న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా, సమయస్ఫూర్తితో సమాధానాలు ఇచ్చిన అనుకీర్తి ఈ ఏటి ఏటి ఫెమీనా మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది.
మొత్తం 30 మంది ఫైనిలిస్టులతో పోటీ పడి అనుకీర్తి విజయం సాధించింది. హర్యానాకు చెందిన మీనాక్షీ చౌదరి రెండో స్థానంలోనూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన కామవరపు శ్రేయారావు మూడో స్థానంలోనూ నిలిచారు. ఇక న్యాయమూర్తుల ప్యానెల్ లో ఇండియన్ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, కేఎల్ రాహుల్, బాలీవుడ్ సెలబ్రిటీలు మలైకా అరోరా, బాబీ డియాల్, కునాల్ కపూర్ లు ఉన్నారు.
అంతే కాదు ఈ కార్యక్రమంలో మరింత కనువిందుగా..మాధురీ దీక్షిత్, కరీనా కపూర్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ ల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. విజయం సాధించిన అనుకీర్తికి, గత సంవత్సరం విజేత మానుషీ చిల్లర్ కిరీటాన్ని అలంకరించగా, ఇక మిస్ వరల్డ్ 2018 పోటీలపై దృష్టిని పెడతానని విజయం సాధించిన అనుకీర్తి మీడియాకు వెల్లడించింది.