చిన్నసినిమాలను నిర్మించటం దాదాపు టాలీవుడ్ మరచిపోయింది. ఒకవేళ మంచి సినిమాలు నిర్మించబడ్డా విడుదల అవ్వాలంటే ఆ నలుగురు లో ఎవరో ఒకరి సహకారం కావాలి లేకుంటే సినిమాలను విడుదల చేయలేని పరిస్థితి అని చిన్న నిర్మాతలు అంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో సినిమా థియేటర్లపై గుత్తాధిపత్యం అంతా దగ్గుబాటి సురేష్బాబు, అల్లు అరవింద్, దిల్ రాజ్, సునీల్ నారంగ్ (ఏసియన్ ఫిలింస్) పిడికిట్లోనే ఉందని, తెలంగాణ ఫిలిమ్ చాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరి గుట్టలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆ నలుగురు కలసి రెండు రాష్ట్రాల లోని థియేటర్లను తమ చేతుల్లో పెట్టుకుని చిన్న చిన్న సినిమాలు విడుదల కాకుండా చూస్తున్నారని, ఆ నలుగురికి దీటుగా చిన్న సినిమా లను ప్రోత్సహించేందుకు త్వరలోనే "డిజిటల్ చానల్" ప్రారంభిస్తున్నామని, దీనికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉందని తెలిపారు.
ప్రభుత్వానికి 20 శాతం పన్నుకడుతూ, చిన్న,పెద్ద సినిమాలను రిలీజ్ చేసేందుకు తాము ప్రణాళికతో ముందుకు వెళ్తుమన్నారు. థియేటర్లు అవసరం లేకుండానే "మా" డిజిటల్ చానల్ ద్వారానే అన్ని టీవీ చానళ్ళ ద్వారా సినిమాలను విడుదల చేస్తామని అన్నారు. ఇండియాలో ఎక్కడ లేని విధంగా "మా-డిజిటల్" ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి "మా-డిజిటల్" ద్వారా సుమారు 1000 చిన్న సినిమాలను విడుదల చేయించి చిన్న, మిడ్ రేంజ్ సినిమా పరిశ్రమను బ్రతికిస్తామని అన్నారు.
ఇది ప్రయోగం విజయవంతం కావాలని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. సమావేశంలో "సోగ్గాడే చిన్నినాయనా - దర్శకుడు కళ్యణ్ కృష్ణ, సినిమా హీరో రాయగిరి ఉమాపతి గౌడ్, డైరెక్టర్ జింక హరీష్ బాబు, సినిమా ఆర్టిస్టు సత్యనారాయణ ఉన్నారు"
అంతేకాదు చిన్న సినిమాలు బ్రతికి బట్టగడితే తెలుగు కళాకారులకు పని దొరుకుతుంది. తద్వారా కొంతైనా కాస్టింగ్ కౌచ్ లాంటి దురాగతాలకు చెక్ పడుతుందని అంటు న్నారు. తెలుగు సినిమా రంగాన్ని ఆ నలుగురి కబంద హస్తాల నుండి విడిపించాలి అని జనం కోరుకుంటున్నారు.