ప్రస్తుతం పర్యవరణ పరిరక్షణకు సంబంధించిన గ్రీన్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి విసిరిన హరిత ఛాలెంజ్కు మెగాస్టార్ స్పందించారు. తన గార్డెన్లో మూడు మొక్కలను నాటారు. తర్వాత బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లకు చిరంజీవి హరిత సవాల్ విసిరారు. హరిత హారం ఛాలెంజ్కు మంచి స్పందన లభిస్తోంది.
హీరో అక్కినేని నాగార్జునకు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్లతోపాటు నాగార్జునకు ఆయన ట్విట్టర్ వేదికగా సవాల్ విసరగా.. త్వరలోనే మొక్కలు నాటుతానని నాగ్ బదులిచ్చారు.
మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, సీనియర్ నటుడు మోహన్బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, కథానాయకుడు మహేశ్బాబు, క్రికెటర్ సచిన్ తెందూల్కర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా తదితరులు ఈ ఛాలెంజ్ను స్వీకరించారు.
భాషా,ప్రాంతీయభేదాలు లేకుండా వివిధ రంగాల ప్రముఖుల మధ్య విభిన్న విషయాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఛాలెంజ్ లు ట్రెండ్ గా మారిన సంగతి తెలిసిందే.
తాజాగా అన్నయ్య చిరంజీవి ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ స్వీకరించారు. పవన్ కళ్యాణ్ హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్, మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు.