ప్రపంచంలో బాషలు మతాలు సాంప్రదాయాలు వేరైనా లక్ష్మీ కటాక్షం కోరుకోని వారుండరు. అందుకోసమే వారివారి స్థాయిలలో సంపద కోసం తహతలాడుతూనే ఉంటారు. మన హిందూ ధర్మ శాస్త్రంలో ‘లక్ష్మీ దేవి’ ఆరాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది. అందువలనే ఆషాఢమాసం తరువాత వచ్చే శ్రావణ మాసంలో లక్ష్మి పూజ చేస్తే చాల మంచిదని మన పూర్వీకుల అభిప్రాయం. ఈ మాసంలో వచ్చే శుక్ర, మంగళ వారాలు ముఖ్యమైనవిగా భావించడంతో ఈ నెలలో వచ్చే నాలుగు శుక్రవారాలు కూడా ‘లక్ష్మీ పూజ’ చేస్తారు.
ఈ పూజలో లక్ష్మిదేవికి ఇష్టమైన శెనగలు నాన బెట్టి వాటిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. శెనగలు అంటే లక్ష్మీ దేవికి చాలా ఇష్టం. పాలతో చేసిన ఏ వంటకమైన లక్ష్మీ దేవికి ఇష్టమే. అందుకే పాలతో పాయసం, పరవాన్నం ఏదైనా పెట్టచ్చు. పూజ గదిలో లక్ష్మీ దేవిని పూలతో చక్కగా అలంకరించి, నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలి. ఎవరినైనా ముత్తైదువును పిలిచి మన శక్తి కొద్ది తాంబూలం ఇవ్వాలి. అయితే నాలుగు వారాలు ఇలా చేసినా రెండవ వారం చేసే ‘వరలక్ష్మి వ్రతం’ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది.
శ్రావణ మాసంలో లక్ష్మీ దేవిని పూజించడం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది. పెళ్లి అయిన వారు ఈ పూజ చేసుకోవడం వలన సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారు అన్న నమ్మకం ఏనాటి నుంచో కొనసాగుతోంది. లక్ష్మీ అనగానే కొందరు ధనము మాత్రమే అనుకుంటారు. ధనము, ధైర్యము, విద్య, ధాన్యము, విజయము, పరపతి, సంతానము, గుణము ఇవన్నీ కూడా మనం లక్ష్మీ ప్రధంగానే భావించాలి. ఈ శ్రావణ మాసంలో ఈ పూజ చేయడం వలన సకల సంపదలు సుఖసంతోషాలు కలుగుతాయని ప్రతీతి.ఈ వ్రత కథలో చారుమతికి అనే స్త్రీ అందరితో అణకువగా ఉంటుందని అత్తమామలను చక్కగా చూసుకుంటుందని అలాంటి స్త్రీకి లక్ష్మీ దేవి కటాక్షం కలిగిందని చెబుతారు.
ఏ ఇంట్లో స్త్రీలు సౌమ్యంగా ఉంటూ, ఇంటిని, ఇంటిల్లపాదిని ప్రశాంతంగా ఉంచుతారో ఆ ఇంట్లో లక్ష్మీ దేవి ఉంటుందని చెపుతారు. అలాగే లక్ష్మీ స్వరూపమైన స్త్రీని, ఏ ఇంట్లో కంటతడి పెట్టనీయక చక్కగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందనే అభిప్రాయం కూడ ఉంది. మన పూర్వీకులు మనకి చెప్పిన ప్రతీ పూజలో సాంప్రదాయాలలోను ఎన్నో ఆరోగ్య సూత్రాలు మరియు మనుషుల జీవన శైలికి కావాల్సిన మంచి విషయాలు కలిగిన నేపధ్యంలో ఈపద్ధతులను ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడి ఏకాగ్రత కలిగి అన్ని పనులలో విజయాన్ని పొందగలుగుతాము..