నటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ బుధవారం నల్లగొండ జిల్లా అన్నెపర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ తనయుడిగా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన హరికృష్ణ పలు చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించిన తర్వాత తండ్రికి చేదోడు వాదోడుగా అన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ చైతన్య రథాన్ని హరికృష్ణ స్వయంగా నడిపేవారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో హరికృష్ణ నట వారసులుగా కళ్యాన్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా కొనసాగుతున్నారు. కళ్యాన్ రామ్ హీరోగానే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నందమూరి హరికృష్ణ ప్రస్తుతం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులుగా కొనసాగుతున్నారు. కాగా, హరికృష్ణ మరణం టాలీవుడ్ ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచింది.
తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నందమూరి కుటుంబాన్ని పరామర్శించాడు. హరికృష్ణ మృతిపై సానుభూతి తెలిపాడు. దాదాపు గంటపాటు మహేశ్ అక్కడే ఉన్నాడు. ఈ సందర్భంగా హరికృష్ణ మంచి నటుడే కాదు మంచి నాయకుడు అని..ఆయన లేని లోటు ఎవ్వరూ పూడ్చలేరని..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.