ఫిలిం ఇండస్ట్రీలో సెలెబ్రెటీలు తాము ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడే తమ కొడుకులను తమ్ముళ్లను తమ వారసులుగా పరిచియం చేసే సాంప్రదాయం ఏనాటి నుంచో కొనసాగుతోంది. అక్కినేని ఎన్టీఆర్ లనుండి లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ వరకు ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈవరసలో అలీ కూడా నిలవడం పెద్ద ఆశ్చర్యం కాకపోయినా కొద్దిగా ఆలస్యంగా ఈవారసత్వ పోరులోకి వచ్చాడనే చెప్పాలి.
అలీ తన తమ్ముడు ఖయ్యుమ్ ని హీరోగా పెట్టి నిర్మాణమవుతున్న ‘దేశంలో దొంగలు పడ్డారు’ అనే సినిమాకు అలీనే సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. వాస్తవానికి మొదట్లో ఈ సినిమాకు ముందు వెనుక నుంచి నడిపిద్దాం అనుకున్నా చివరికి టైటిల్ కార్డ్స్ లో తన పేరు వేసుకునే దాకా వచ్చేసిందని టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు క్రైం థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈమూవీలో ఘాటైన రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది.
గౌతమ్ రాజ్ కుమార్ అనే యువదర్శకుడు దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో సమీర్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గతంలో ఇదే టైటిల్ తో సుమన్ విజయశాంతిలతో ఒక మూవీ ఇదే టైటిల్ తో విడుదల అయి హిట్ అయిన నేపధ్యంలో తిరిగి అదే సెంటిమెంట్ ను రిపీట్ చేయాలని అలీ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. నటుడిగా ఖయ్యుమ్ కు ఇది తొలి ప్రయత్నంకాదు. గతంలో స్టార్ హీరోలందరితో చాలా సినిమాలలో చిన్నచిన్న పాత్రలు చేసాడు.
నాగార్జున నటించిన సూపర్ మూవీలో మంచి ప్రాధాన్యమున్నపాత్రలో నటించి మెప్పించిన ఖయ్యుమ్ కు ఇండస్ట్రీ వర్గాల నుండి పెద్దగా ఆదరణ లభించలేదు. ఇప్పటికే అలీ కమెడియన్ గా రాణించాడు కాని హీరోగా మాత్రం ఒక్క సక్సెస్ కూడా అందుకోలేకపోయాడు అన్నది వాస్తవం. అప్పట్లో వచ్చిన ఒక ‘యమలీల’ మాత్రమే మినహాయింపు. తమ్ముడిని హీరోగా సెటిల్ చేయాలని అలీ చేస్తున్న ప్రయత్నాలు మంచివే అయినా ఆ ప్రయత్నాలకు ఇండస్ట్రీ వర్గాలనుండి అదేవిధంగా బయ్యర్ల నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందడంలేదు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనితో అలీకి తమ్ముడి టార్చర్ మొదలైంది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి..