తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’బయోపిక్. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా తీస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం ఎన్టీఆర్ సినీ నేపథ్యంలో రూపుదిద్దుకోగా..రెండో భాగం ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఉంటుందట.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెండు పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా జనవరి 9న రిలీజ్ కాబోతుంది. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ జనవరి 24 న రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఇండస్ట్రీలో ఎన్టీఆర్ .. శ్రీదేవితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ సినిమాలన్నీ కూడా ఘన విజయాలను అందుకున్నాయి.
దాంతో ఈ సినిమాలో శ్రీదేవి పాత్ర కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాలలో 'వేటగాడు' ఒకటిగా నిలిచింది. ఇందులోని 'ఆకుచాటు పిందె తడిసే' పాట ఎప్పటికీ ఎవర్ గ్రీనే. శ్రీదేవి పాత్ర కోసం రకుల్ ను తీసుకున్న క్రిష్, రీసెంట్ గా ఈ పాటను బాలకృష్ణ - రకుల్ పై చిత్రీకరించారు.
ఈ రోజు రకూల్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కొద్ది సేపటి క్రితం..'ఆకు చాటు పిందె తడిసే' పాటలోని స్టిల్ ను వదిలారు. నందమూరి అభిమానులను మరింత హుషారెత్తించేలా ఈ పోస్టర్ వుంది. సంక్రాంతికి ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయనున్నారు.