విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ, రాజకీయ దురంధరుడు నందమూరి తారక రామారావు బయోపిక్ నిర్మాణాల సీజన్ ప్రారంభమైంది. ఒక వైపు ఆయన తనయుడైన నందమూరి బాలకృష్ణ నిర్మిస్తున్న ఎన్ టీ ఆర్ బయోపిక్ షూటింగ్ జోరుగా సాగుతుంటే, జాతీయ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను తీయబోయే
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రనిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఆ విషయంపైనే ఆయన ట్విట్టర్ లో ఒక పోస్టు పెట్టారు.
"నాస్తికుడినైన నేను నా జీవితంలో తొలిసారిగా రేపు ఉదయం సరిగా 6 గంటల కి తిరుమలలో శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని సాయంత్రం 4గంటలకి తిరుపతిలోని “ శిల్పారామం” లో ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా వివరాలు చెప్పబోతున్నాను" అని ట్విట్టర్ లో పోస్టు చేశారు. వెంకటేశ్వర స్వామి ఫొటోను కూడా ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు.
అంతకు ముందే ఈ నెల 15వ తేదీన మరో పోస్టు పెట్టారు. ఎన్టీఆర్ పాత్ర కోసం ముగ్గురిని షార్ట్-లిస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. లక్ష్మీ పార్వతిని కలిసినప్పుడు ఎన్టీఆర్ ఎలా ఉన్నారో అలాంటి లుక్ కలిగిన నటుడి కోసం చూస్తున్నానని, అటు వంటి వ్యక్తిని గుర్తించి, వీడియో పంపిన వారికి పది లక్షల రూపాయలు ఇస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబు వంటి వ్యక్తిని గుర్తించిన వ్యక్తికి లక్ష రూపాయలు ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు.