దేశంలో మీటూ ఉద్యమం ఉధృతం అవుతున్న సమయంలో ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై కొందరు స్త్రీలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను చిన్మయి ట్వీటర్ ద్వారా బయటపెట్టిన విషయం తెలిసిందే. కాగా, తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చిన వైరముత్తు...ఆరోపణలు చేసే వారు కోర్టును ఆశ్రయించవచ్చని సవాల్ చేశారు. చిన్మయి ఆరోపణల్లో వాస్తవం లేదని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పారు. ఇదిలా ఉంటే..చిన్మయి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..తాను చేస్తున్న ‘మీటు’ ఉద్యమాన్ని ఆపి వేయాలని..లేదంటే తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. అంతే కాదు వైరముత్తుపై త్వరలోనే కేసు పెట్టనున్నట్లు ప్రకటించారు.
వైరముత్తు తనను వేధింపులకు గురిచేసిన ఘటన 2005-06 లలో స్విట్జర్లాండ్లో జరిగిందని చెప్పారు. స్విట్జర్లాండ్లో జరిగిన సంగీత కార్యక్రమానికి తాను హాజరుకావడానికి తన పాస్పోర్ట్ ప్రధాన సాక్ష్యాధారమన్నారు. అయితే 2006 తర్వాత తాము పలు ఇళ్లకు నివాసాన్ని మార్చామని, పాత పాస్పోర్ట్ కనిపించడం లేదన్నారు. పాత పాస్పోర్ట్ దొరికిని వెంటనే దాని ఆధారంగా వైరముత్తుపై కేసు పెట్టనున్నట్లు ఆమె మీడియాకు తెలిపారు.
నాపై యాసిడ్ పోస్తామంటూ హత్యా బెదిరింపులు వస్తున్నాయి. అదే విధంగా గత వారం రోజులుగా ప్రశ్నలతో నన్ను వేధిస్తున్నారు. ఎప్పుడో జరిగిన సంఘటనను అప్పుడే బయటపెట్టకుండా ఇప్పుడెందుకు చెబుతున్నావని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. లైంగిక వేధింపుల పై పోరాటం చేస్తానని అంటోంది చిన్మయి . దాంతో కొంతమంది బెదిరిస్తున్నారట . ప్రస్తుతం మీటూ దేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది . ఇక సినిమా రంగంలో అయితే వణుకు మొదలయ్యింది .