తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య స్టార్ హీరోలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు వచ్చిన సమయంలో టాలీవుడ్ చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని తమ వంతు సహాయకార్యక్రమాల్లో పాల్గొనండమే కాకుండా, విరాళాలు కూడా ఇస్తున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో మెగా స్టార్ ఫ్యామిలీ అంటే ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు అరడజను మంది హీరోలు వచ్చారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘జనసేన’ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ పటిష్టత పెంచేందుకు ప్రజల్లో మమేకం అవుతూ..ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మద్య ఉత్తరాంధ్రలో ‘తిత్లీ’తుఫాన్ ఎంత విషాదం నింపిందో అందరికీ తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలో అపార నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాన్ తన అన్న కుమారుడు రాంచరణ్ ని శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా సూచించడం..అందుకు చరణ్ సిద్దం అయ్యారని వార్తలు వచ్చాయి. దీనిపై చెర్రీపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.
తాజాగా హీరో మంచు మనోజ్ కూడా స్పందించాడు. ట్విట్టర్ ద్వారా చెర్రీని ప్రశంసించాడు. అంతేకాదు రాంచరణ్ ని ఇలాంటి మంచి పనికి ప్రేరేపించిన పవన్ కళ్యాన్ ని కూడా ఎంతో పొగిడారు. ‘‘అంతా మన నుంచే మొదలవ్వాలి.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అన్నా. గొప్ప కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి పనిని చేపట్టేందుకు రామ్ చరణ్కు స్ఫూర్తి కలిగించిన పవన్ కల్యాణ్ గారికి ధన్యవాదాలు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం చాలా మంచి పని’’ అంటూ మనోజ్ ట్వీట్లో పేర్కొన్నాడు. కాగా, తిత్లీ తుఫాన్ బాధితులకు ఇండస్ట్రీ నుంచి పలువురు హీరోలు తమ స్థాయికి తగ్గట్టుగా విరాళాలు ఇచ్చారు.