చిత్రం, నువ్వు—నేను, మనసంతా నువ్వే వంటి 100కు పైగా సినిమాలకు పాటలు రాసిన కులశేఖర్ ని హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఆలయ పూజారి చేతి సంచిని చోరీ చేసిన కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్టణంలోని సింహాచలానికి చెందిన కులశేఖర్ హైదరాబాద్ మోతీనగర్లో ఉంటూ చిత్రాలకు పాటలు రాస్తున్నాడు. శ్రీనగర్కాలనీలోని ఓ ఆలయం వద్ద నిన్న అనుమానాస్పదంగా తిరుగుతుండగా బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
కుల శేఖర్ నుండి రూ.50వేల విలువైన 10సెల్ఫోన్లు, రూ.45వేల విలువైన బ్యాగులు, కొన్ని క్రెడిట్, డెబిట్ కార్డులు, తాళంచెవులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఓ చిత్రంలో కులశేఖర్ రాసిన పాట బ్రాహ్మణులను కించపరిచేలా ఉందంటూ ఆ సామాజిక వర్గం అతడిని దూరం పెట్టింది. దీంతో బ్రాహ్మణులపై కక్ష పెంచుకున్న ఆయన ఆలయాలు, పూజారులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు.
2016లో కాకినాడలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శఠగోపాన్ని చోరీ చేశాడు. ఈ కేసులో రాజమండ్రి జైలులో ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. కులశేఖర్ పూర్తి పేరు తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్. స్వస్థలం సింహాచలం. చెడు వ్యసనాలకు బానిసై కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు. అంతే కాదు అతని కుటుంబ సభ్యులు కూడా అతన్ని దూరంగా పెట్టినట్లు సమాచారం. కొంత కాలంగా బ్రాహ్మణులపై ద్వేషం పెంచుకున్న కులశేఖర్, పూజారులను, ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు.