తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ ల పర్వం కొనసాగుతుంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ‘ఎన్టీఆర్’బయోపిక్ చిత్రీకరణ పనులు చకచకా జరుగుతున్నాయి. మొదటి భాగమైన 'కథానాయకుడు'కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుపుతూ వస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ మహోన్నతమైన స్థాయికి ఎదిగారు..విశ్వనటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ‘ఎన్టీఆర్’బయోపిక్ రెండు భాగాలుగా తీస్తున్న విషయం తెలిసిందే..ఒకటి ఆయన నటనా జీవితానికి సంబంధించి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, రెండో భాగం ఆయన రాజకీయ జీవితానికి సంబంధించి ‘ఎన్టీఆర్ మహానాయకుడు’.
ఈ రెండు చిత్రాలు కొద్ది గ్యాప్ తోనే జనవరిలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో 'దాన వీర శూర కర్ణ' ఒకటి. 1977లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలోని 'చిత్రం భళారే విచిత్రం' అనే పాట ఆపాతమధురాల్లో ఒకటి. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఈ పాటను ఈ రోజున చిత్రీకరించడం మొదలు పెట్టనున్నారు.
'దాన వీర శూర కర్ణ'లో అర్జునుడుగా హరికృష్ణ నటించారు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్ర ఆయన తనయుడు కళ్యాన్ రామ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కళ్యాన్ రామ్ అర్జునుడిగా కనిపించబోతున్నారట. త్వరలోనే కర్ణుడిగా బాలకృష్ణ .. అర్జునుడిగా కల్యాణ్ రామ్ కాంబినేషన్లోని ఒక సీన్ ను చిత్రీకరించనున్నారు. జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.