పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో పవన్ ‘జనసేన’ కు ‘గాజు గ్లాస్’ గుర్తుగా కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన 29 పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులలో పవన్ ‘జనసేన’ కు ఈ గాజు గ్లాస్ గుర్తు దక్కింది.
వచ్చే ఏడాది జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన 42 లోకసభ నియోజకవర్గాలలోను పవన్ ‘జనసేన’ ఈ గుర్తు పై పోటీ చేయబోతోంది. వాస్తవానికి పవన్ ‘పిడికిలి’ గుర్తును తన ‘జనసేన’ కు కోరుకున్నాడు. ఎన్నికల ప్రచారంలో ఉద్వేగభరితంగా ఉపన్యాసం ఇచ్చిన తరువాత ‘పిడికిలి’ బిగించి అభివాదం చేస్తే ఆ గుర్తు జనం మధ్యకు చాల సులువుగా వెళ్లి పోతుందని పవన్ భావించాడు.
అయితే పవన్ ఆశలకు భిన్నంగా పవన్ కు ‘గాజు గ్లాస్’ గుర్తు రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి గాజు గ్లాస్ ను తెలియని వారు ఎవరు ఉండకపోయినా ఆ గుర్తు ఎన్నికల గుర్తుగా ఎంత వరకు బాగుంటుంది అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దీనికితోడు ‘గాజు గ్లాస్’ అతి సున్నితంగా ఉంటూ ఏమాత్రం ప్రమాదం జరిగినా పైగిలి పోతుంది కాబట్టి పవన్ ‘జనసేన’ పార్టీ పై సెటైర్లు పడే అవకాశం ఉంది. అయితే పవన్ సున్నిత మనసుకు తగ్గట్టుగా ‘జనసేన’ కు సరైన గుర్తు లభించింది అనీ ఈ గుర్తును చాల సులువుగా జనంలోకి తీసుకు వెళ్ళిపోవచ్చు అంటూ పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు..