తెలుగు వెండితెరకు ఎన్టీఆర్ ఓ రారాజు. నటనలోనూ, క్రమశిక్షణలోనూ ఆయన తర్వాతే ఎవరైనా. ఎన్టీఆర్ బయోపిక్ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ కు సంబంధించిన అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన గొప్పదనాన్ని ఇంటర్వ్యూల్లో వివరిస్తున్నారు.
ప్రధానంగా ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ తన జ్ఞాపకాన్ని మీడియాతో పంచుకున్నారు. ఎన్టీఆర్ తమను ఎప్పడూ గారాబం చేయలేదంటున్న ఆయన అందుకు ఉదాహరణగా ఈ ఘటన గురించి వివరించారు. విశ్వామిత్ర సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య కూడా అందులో నటించారు.
కపాల మోక్షం సన్నివేశంలో బాలయ్య కాలివద్ద ఓ టపాసు పేలాల్సి ఉంది. కానీ అది సమయానికి పేలలేదు. షూటింగ్ సిబ్బంది మరో టపాసు వేశారు. రెండూ ఒకేసారి పేలాయట. దాంతో బాలయ్య కాలికి గాయమైందట. కాలికి దెబ్బ తగిలినా రక్తం వస్తున్నా సీన్ పాడవుతుందని బాలయ్య కదలలేదట.
ఆ విషయం ఎన్టీఆర్ కూడా గమనించారట. అయినా ఆయన నెక్స్ట్ షాట్ అంటూ వెళ్లిపోయారు కానీ దగ్గరకు వచ్చి గాయం సంగతి పరామర్శించలేదట. అదే ఈ రోజుల్లో.. వేరే ఎవరైనా అయితే ఎంత హడావిడి చేసేవారో అంటూ బాలయ్య తండ్రి క్రమశిక్షణ గురించి చెప్పుకొచ్చారు.
తమ తండ్రి ఎన్టీఆర్ అలా పెంచబట్టే ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునే శక్తి తమకు లభించిందని బాలయ్య ఆనాటి జ్ఞాపకాలను తలచుకున్నారు. ఓ నటుడిగా ఎన్టీఆర్ ప్రభావం ఉంటుందన్న బాలయ్య.. ఆయన జ్ఞాపకార్థమే ఈ సినిమా నిర్మాణం తలపెట్టామన్నారు. లాభాపేక్షతో కాకుండా తండ్రికి తాను ఇచ్చే నివాళిగా ఈ బయోపిక్ నిర్మించామని బాలయ్య తెలిపారు.