మెగాస్టార్ వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన రామ్ చరణ్ తేజ ఫైట్స్, డ్యాన్స్ విషయంలో అభిమానులను మెప్పించినా.. ఇంకా నటన పరంగా మెరుగుపడాలన్న అభిప్రాయం మొన్నటి వరకూ ఉండేది. రంగస్థలం చిత్రంతో దాన్ని పటాపంచలు చేశాడు కొణిదెల వారసుడు. ఒక్క సినిమాతోనే ఎవరూ ఊహించినంత ఎత్తుకు ఎదిగాడు. అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
మరి రంగస్థలం వంటి సినిమా తర్వాత రామ్ చరణ్ తీస్తున్న సినిమా కావడంతో వినయ విధేయ రామపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. చరణ్ సినీ కెరీర్ గురించి ఎంతో శ్రద్ధ తీసుకునే మెగాస్టార్ ఈ వినయ విధేయ గురించి ఏమన్నారు.. ఆయన ఈ కథ వినగానే ఏం చెప్పారు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు బోయపాటి వెల్లడించారు.
తాను ప్రతి కథనూ సెట్కు వెళ్లే ముందు చిరంజీవి గారికి వినిపిస్తాడట. చిరంజీవి కథలను బాగా జడ్జ్ చేస్తారని బోయపాటి విశ్వాసం. గతంలో చాలాసార్లు చిరంజీవి సూచనల మేరకు కథల్లో మార్పులు చేశారట. అవి బాగా సినిమాలకు ప్లస్ అయ్యాయట. అందుకు సరైనోడు సినిమా ఓ ఉదాహరణ అంటున్నారు బోయపాటి.
అన్ని కథల్లాగే ఈ వినయ విథేయ రామ కథనూ చిరంజీవికి వినిపించాడట బోయపాటి. చిరంజీవి ప్రతి సీన్ చాలా ఆసక్తిగా విన్నారట. కథ చెప్పడం అయ్యాక మార్పుల గురించి అడిగారట బోయపాటి. కానీ చిరంజీవి అసలు మార్చడానికి ఏమాత్రం వీలు లేనంతగా స్టోరీ రెడీ చేశావు అని మెచ్చుకున్నారట.