తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ తో 2.0 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్నారు. గతంలో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు’అద్భుతమైన విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘భారతీయుడు 2’చిత్రం షూటింగ్ జనవరి 18 నుండి పొల్లాచ్చిలో ప్రారంభం అయింది. రూ.180 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది.
తెలుగు, తమిళం, హిందీతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని ఏక కాలంలో తీస్తున్నట్టు సమాచారం. అయితే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే ఆపివేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శంకర్ చిత్రాలంటే భారీ సెట్టింగులు ఉంటాయని తెలిసిందే..అయితే ఈ సెట్స్ కి సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతో కొద్ది రోజుల వరకు చిత్ర షూటింగ్కి బ్రేక్ ఇచ్చారని కోలీవుడ్ సమాచారం. శంకర్ తీసే ప్రతి చిత్రంలో ఏదో ఒక వెరైటీ ఉండటం..మెసేజ్ ఉండటం చూస్తూనే ఉంటాం.
ఇండియన్ 2 చిత్రానికి కొంచెం కొరియన్ టచ్ కూడా ఇవ్వాలని భావించిన శంకర్ కొరియన్ భామ సూజీ బే ని కీలక పాత్ర కోసం తీసుకున్నారట. కథానుసారం చిత్రంకి సంబంధించిన కొంత షూటింగ్ తైవాన్లో జరగనుంది. ఇదే సమయంలో సూజీ చిత్ర యూనిట్తో కలవనుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం కోసం హాలీవుడ్ మేకప్ మేన్లు పలువురు చెన్నైకి వచ్చినట్లు సమాచారం.
గతంలో భారతీయుడు చిత్రంలో సీబీఐ ఆఫీసర్ పాత్రనే సీక్వెల్లోనూ నెడుముడి వేణు పోషించనున్నారు వెన్నెల కిషోర్ కూడా చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో కమల్హాసన్కి జోడీగా కాజల్ నటించనున్నారు .దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో, అజయ్ దేవ్గణ్ నెగటివ్ పాత్రలో నటిస్తారని సమాచారం . శింబు కూడా ముఖ్య పాత్ర చేయనున్నాడని అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిరుధ్ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు.